Sep 18,2023 13:29

వాషింగ్టన్‌ (అమెరికా) : బాక్టీరియా సోకిన సముద్రపు చేపను తిని ఓ మహిళ తన కాళ్లు, చేతులను కోల్పోయిన విషాదకర ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. బ్యాక్టీరియా సోకిన చేపను సరిగ్గా ఉడికించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకెళితే ... లారా బరాజాస్‌ (40) అనే మహిళకు విబ్రియో వల్నిఫికస్‌ అనే అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా సోకింది. ఆ బ్యాక్టీరియా ఎక్కువగా సముద్ర ఆహారం, సముద్ర నీటిలో ఉంటుంది. కాలిఫోర్నియాలోని స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన టిలపియా చేప తిన్న తర్వాతే ఆమె అనారోగ్యానికి గురయ్యారని లారా స్నేహితురాలు అన్నా మెస్సినా మీడియాకు తెలిపారు. లారా కొద్దికాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత.. గత వారం ఆమెకు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను డాక్టర్లు చేశారు. ఆమె ప్రాణాలను కాపాడే క్రమంలో వైద్యులు ఆమె కాళ్లూ చేతులను తొలగించారు.

                                                 ఆమె ప్రాణాలు పోయినంతపనైంది : లారా స్నేహితురాలు

'' ఆమె ప్రాణాలు పోయినంతపనైంది. కొంతకాలంపాటు ఆమె రెస్పిరేటర్‌పై ఉంది. డాక్టర్లు ఆమెను వైద్యపరమైన కోమాలో ఉంచారు. ఆమె కింది పెదవి, వేళ్లు, పాదాలు నల్లగా మారాయి. కిడ్నీల పనితీరు దెబ్బతింది. శరీరం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఈ ఘటన మాపై ఎంతో ప్రభావం చూపింది. ఇది మాకు భయానక అనుభవం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు '' అని మెస్సినా ఆవేదన వ్యక్తం చేశారు.

                                          రెండు రకాలుగా ఈ బాక్టీరియా శరీరంలో ప్రవేశిస్తుంది : డాక్టర్‌ నటాషా

ఈ ఘటన సముద్ర ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అవసరాన్ని నొక్కి చెబుతోందని నిపుణులు హెచ్చరించారు. యూసీఎస్‌ఎఫ్‌కు చెందిన అంటువ్యాధుల విభాగం నిపుణులు డాక్టర్‌ నటాషా మాట్లాడుతూ ... రెండు రకాలుగా ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుందని అన్నారు. ఒకటి.. ఆ బ్యాక్టీరియా ఉన్న ఆహారాన్ని తినడం. రెండు.. ఆ సూక్ష్మక్రిములు ఉన్న నీరు టాటూలు ఇతర మార్గాల ద్వారా శరీరంలో చేరడం అని చెప్పారు.