ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం మండల పరిధిలోని 54 ప్రభుత్వ పాఠశాలలో నాడు - నేడు రెండవ విడత నిధులు రూ.14.95 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంఈఓ సిహెచ్ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందులో 9 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మిగిలిన పాఠశాలల్లో పాఠశాలల అభివద్ధిలో భాగంగా 9 రకాల అవసరాలకు సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీ యూపీ స్కూలు, గోలి చిన్న కొండయ్య యూపీ స్కూల్, రాజీవ్ గాంధీ యూపీ స్కూల్, మండల పరిధిలోని చంద్రమాంపల్లి, కాండ్రకోట, వడ్లమూరు, కట్టమూరు జిల్లా పరిషత్ హై స్కూల్స్, జె తిమ్మాపురం, ఆర్బి కొత్తూరు, ఉలిమేశ్వరం, వాలు తిమ్మాపురం, మరలావ ఎలిమెంటరీ స్కూల్స్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.










