బెంగళూరు: మాల్దీవులు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానం టాయిలెట్స్లోని వాష్ బేసిన్లో 3.2 కిలోల బంగారాన్ని గుర్తించి అధికారులు సీజ్ చేశారు. అధికారులు సీజ్ చేసిన ఆ బంగారం విలువ సుమారుగా రూ.1.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మాల్దీవులు నుంచి అక్రమంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు విమానం ఎయిర్పోర్టులో దిగగానే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అది గుర్తించిన నిందితులు ఆ బంగారాన్ని టాయిలెట్స్లోని వాష్ బేసిన్లో పడేశారు. తనిఖీ చేస్తూ వచ్చిన అధికారులకు వాష్బేసిన్లో ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరచి చూడగా అందులో బంగారం కనిపించింది. దొరికిన బంగారు బిస్కెట్లను సీజ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.