ప్రజాశక్తి-కాకినాడ : డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో నమోదైన సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డా.కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరు కార్యాలయం నుంచి కలెక్టర్ డా.కృతికాశుక్లా ఉదయం 10:30 గంటల నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి 16 మంది వివిధ సంక్షేమ పథకాల లబ్ధి, విద్య, ఉపాధి, భూ సర్వే, భూ సమస్యలు వంటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 18004253077కు ఫోన్ చేసి కలెక్టరుకు నేరుగా తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నమన్నారు. ఫోన్ ద్వారా తెలియజేసిన 16 మంది వ్యక్తుల సమస్యలను పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందన్నారు. అధికారులు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో నమోదైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసు, వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.










