రోమ్ : గతవారం చివర్లో శని, ఆదివారాల్లో ఇటాలియన్ భూభాగానికి వలసదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరంతా ఆఫ్రికాలోని ఉత్తర తీరాలకు దగ్గరగా ఉన్న ఇటాలియన్ భూభాగమైన లాంపెడుసా ద్వీపంలోని రిసెప్షన్ సెంటర్కి పడవల ద్వారా దాదాపు 1300 మంది చేరుకున్నారు. అయితే ఇటలీ భూభాగానికి చేరుకునే వలసదారుల్ని నౌకాశ్రయ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 12 పడవల్లో 691 మంది ఉన్న వలసదారులను నౌకాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. ఈ పడవల్లోని ఉన్న వారంతా లిబియాలోని జువారా, ట్యునీషియాలోని స్ఫాక్స్ నుండి బయలుదేరినవారని అధికారులు సోమవారం వెల్లడించారు. అయితే ఇటలీకి చేరుకున్న వలసదారులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కూడా వలసదారులు దిగడానికి ఓడరేవులను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.










