Oct 22,2023 09:11

న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకులు ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ విభాగం ఇన్‌ఛార్జి అమిత్‌ చక్రవర్తిల జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. తదుపరి కస్టడీని కోరుతూ ఢిల్లీ పోలీసులు వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు అదనపు సెషన్స్‌ జడ్జి హర్దీప్‌ కౌర్‌ వారి కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైనా అనుకూల వార్తలు ప్రసారం చేస్తోందని ఆరోపిస్తూ ఉగ్రవాద వ్యతిరేక చట్టం యుఎపిఎ కింద ఢిల్లీ పోలీసులు ఈనెల 3న ప్రబీర్‌ పుర్కాయస్థ, అమిత్‌ చక్రవర్తిలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం విదితమే. వీరి అరెస్టులు దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మోడీ సర్కారు మీడియాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని పలు మీడియా సంస్థలు, జర్నలిస్టులు, మేధావులు విమర్శిస్తున్నారు.