
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 73 ఏళ్లు పూర్తయి, 74వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు, రాజ్యాంగ పదవులలో ఉన్న ఉపరాష్ట్రపతి, గవర్నర్లు వంటి వారు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపం, లక్ష్యాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు. 2014లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి అమలు, మూడు వ్యవసాయ చట్టాలు, జాతీయ విద్యావిధానం-2020 మొదలైనవన్నీ రాజ్యాంగ విరుద్ధమే. రాష్ట్రాలతో సంప్రదించటంగానీ, చర్చించటంగాని చేయకుండానే ఈ విధానాలను అమలు చేయటం, చట్టాలు చేయటం వంటి వాటికి కేంద్రం పాల్పడింది. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన స్వాతంత్య్రపు హక్కును హరిస్తూ 'భావప్రకటనా స్వేచ్ఛ'ను అణచివేస్తున్నది. అనేకమందిని 'ఉపా' చట్టం కింద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఢిల్లీలో గల జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీల్లో జరుగుతున్న సంఘటనలు రాజ్యాంగ హక్కుల హరణకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ నేపథ్యంలో సర్వోన్నతమైన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులపై ఉన్నది.
- పార్లమెంట్ ఆధిక్యత ఉండదు
ఇటీవల జైపూర్లో జరిగిన 83వ అఖిల భారత స్పీకర్ల సమావేశంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ ఆధిక్యత కలిగి ఉండాలని, పార్లమెంటరీ సార్వభౌమాధికారం ఉండాలని వాదన చేశారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఆధునిక ప్రజాస్వామ్యాలు ప్రారంభమైన తరువాత ఫ్రెంచ్ న్యాయ నిపుణుడు మాంటెస్క్యూ 'ది స్పిరిట్ ఆఫ్ లాస్' అనే గ్రంథాన్ని రాశారు. ప్రభుత్వ అంగాలైన శాసన వ్యవస్థ (లెజిస్లేచర్), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్), న్యాయ వ్యవస్థ (జ్యుడిషియరీ)-మూడు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించరాదని, ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలని దానిలో చెప్పారు. అమెరికా రాజ్యాంగంలో మాంటిస్క్యూ ప్రతిపాదించిన 'అధికార పృథక్కరణ' సిద్ధాంతాన్ని 'చెక్స్ అండ్ బాలెన్సస్' పేరుతో అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు డా||అంబేద్కర్ నాయకత్వాన రాజ్యాంగంలో ప్రభుత్వ అంగాలు మూడింటి మధ్య ఆధిపత్యం ఉండరాదని భావించారు. ఈ మూడు వ్యవస్థలు తాను విధించిన పరిధిలోనే పనిచేయాలని రాజ్యాంగం స్పష్టం చేసింది. కేంద్ర న్యాయశాఖా మంత్రితో సహా అనేకమంది అధికార పార్టీ ప్రముఖులు న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే వాదనలు చేస్తున్నారు.
- న్యాయ సమీక్షాధికారం
అమెరికన్ సుప్రీంకోర్టు 1803లో తొలిసారిగా మాడిసన్ వర్సెస్ మార్బరీ కేసులో తొలిసారిగా న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాధికారం ఉందని ప్రకటించింది. న్యాయ సమీక్షాధికారాన్ని 'జ్యుడిషియల్ రివ్యూ' అంటారు. న్యాయ సమీక్షాధికారం అనగా 'పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా (అల్ట్రా వైర్స్) ఉంటే అవి చెల్లవు (నల్ అండ్ వాయిడ్) అని ప్రకటించటం. న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ పరిరక్షణకు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. భారత రాజ్యాంగంలో 13వ నిబంధన భారత న్యాయ వ్యవస్థకుగల న్యాయ సమీక్షాధికారాన్ని వివరించింది. గత 73 ఏళ్లలో పార్లమెంట్ చేసిన అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించుకొని కొట్టివేసింది. 1952లో వి.జి.రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పతంజలి శాస్త్రి 'న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను న్యాయస్థానాలు నెరవేర్చడమే తప్ప పార్లమెంట్పై తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి కాదని స్పష్టం చేశారు. న్యాయ సమీక్షాధికారంలో భాగంగా జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ ఓ చిన్నపరెడ్డి, జస్టిస్ వై.వి.చంద్రచూడ్ మొదలైన న్యాయమూర్తులు అత్యున్నతమైన తీర్పులు ఇచ్చారు.
- కేశవానంద భారతి కేసు-మౌలిక స్వరూపం
2023 జనవరి 7వ తేదీన రాజ్యసభ సమావేశాలలోను, ఇటీవల జైపూర్లో జరిగిన 83వ భారత శాసనసభల స్పీకర్ల సమావేశంలోను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్...భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో ఇచ్చిన తీర్పుతో తాను ఏకభవించడంలేదని విపరీత వాదన చేశారు. పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు సమీక్షించి ఆ చట్టాలను రద్దు చేస్తే ప్రజాభిప్రాయాన్ని, పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని తిరస్కరించినట్లని ఆయన భాష్యం చెప్పారు.
పార్లమెంట్కు ప్రాథమిక హక్కులను సవరణ చేసే అధికారం లేదని 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి భిన్నంగా 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ...రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చకుండా సవరణ చేయవచ్చని తీర్పు చెప్పినది. ఈ తీర్పు 368వ నిబంధన కింద రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కు గల అధికారాలపై పరిమితి విధించింది. పార్లమెంట్లో మెజారిటీ ఉందనే కారణంతో నిరంకుశంగా రాజ్యాంగాన్ని సవరించే ధోరణిని అరికట్టడానికి, కీలక రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి ఈ తీర్పు దోహద పడుతుందని ఆనాడు న్యాయ నిపుణులు, రాజకీయ పార్టీలు హర్షం వెలిబుచ్చాయి.
కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో (1973) సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది. ఆ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ 'మౌలిక స్వరూపాన్ని' (బేసిక్ స్ట్రక్చర్) వివరించింది. కేసును విచారించటానికి 13 మంది న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పడి విచారణ చేసింది. జస్టిస్ వై.వి.చంద్రచూడ్, జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా, జస్టిస్ ఎ.ఎన్.రే, జస్టిస్ సిక్రి, జస్టిస్ గ్రోవర్ వంటి ఉద్దండులు ధర్మాసనంలో ఉన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే, సవరణ చేసే అధికారం పార్లమెంట్కు లేదని తీర్పు చెప్పారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించారు. రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం, న్యాయ సమీక్షాధికారం, లౌకిక విధానం, ప్రాథమిక హక్కులు మొదలైనవాటిని పేర్కొన్నారు. పార్లమెంట్కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం ఉన్నది కాని రాజ్యాంగ మౌలిక స్వభావానికి భంగం కలగని విధంగా మాత్రమే పార్లమెంట్ తన అధికారాన్ని వినియోగించాలని ఈ కేసు ద్వారా నిర్ధారణ జరిగింది. 1980లో సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యత ఉండాలని స్పష్టంగా పేర్కొన్నది. ఇటీవల ఉపరాష్ట్రపతితో సహా అనేక మంది బి.జె.పి నాయకులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిరాకరించి, పార్లమెంట్ ఆధిక్యత ఉండాలని ప్రచారం చేయటం పూర్తి రాజ్యాంగ విరుద్ధం.
- రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు
భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వానగల మంత్రిమండలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వానగల మంత్రిమండలి నిజమైన అధికారాలు కలిగి ఉంటాయి. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ నామమాత్ర అధిపతులుగా ఉంటారు. రాజ్యాంగంలో 163వ నిబంధన ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ వ్యవహరించాలి. కాని కొన్ని సమయాల్లో గవర్నర్లు కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించకుండా, కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో రామ్లాల్, కుముద్ బెన్జోషి వంటి గవర్నర్లు ఎన్నో వివాదాలు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కల్పించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో గవర్నర్లు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇటీవల తమిళనాడు గవర్నర్ రవి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న తీరు ఎన్నో విమర్శలకు గురైంది. గతంలో కొన్ని కమిటీలు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సిఫార్సులు చేయగా, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై నియమించిన సర్కారియా కమిషన్...గవర్నర్ల పనితీరుపై కొన్ని పరిమితులు ఉండాలని కొన్ని సూచనలు చేసినది. పార్లమెంటరీ విధానం కొనసాగుతున్న భారత దేశంలో గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
- రాజ్యాంగం ఉన్నతమైనది
పార్లమెంట్లో పాలక పార్టీలకు మెజారిటీ వస్తూ, పోతూ ఉంటుంది. రాజ్యాంగం, దాని స్ఫూర్తి, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా ఉంటాయి. పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ వీటన్నిటి ఉనికికి రాజ్యాంగమే మూలాధారం. ఈ మూడు వ్యవస్థలు తమ, తమ పరిధిలో పనిచేయాలని రాజ్యాంగం స్పష్టం చేసినది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు చేస్తున్నది. సమాఖ్య విధానంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు విభజించబడి ఉంటాయి. రాజ్యాంగ 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా అధికార విభజన జరిగింది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా రాష్ట్రాలతో సంప్రదించకుండానే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలు చేయటంతో లక్షలాదిమంది రైతులు సుమారు 400 రోజులపాటు ఉద్యమం చేయడంతో ఆ చట్టాలు ఉపసంహరించుకోక తప్పలేదు. ఇది రైతాంగ ఉద్యమం ఉమ్మడిగా సాధించిన ఘన విజయం. అలాగే విద్య ఉమ్మడి జాబితాలో ఉండగా, రాష్ట్రాలతో చర్చించకుండానే కరోనా సమయంలో కేంద్రం జాతీయ విద్యావిధానం-2020 ఏకపక్షంగా ప్రకటించింది. అందువలన తమిళనాడు, కేరళ వంటి ప్రభుత్వాలు దీనిని అమలు చేయటానికి నిరాకరించాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయకుండా ఉండటానికి కేంద్రం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పేర్కొన్న లౌకికవాదాన్ని, భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ లక్ష్యాలు, విలువలను కాపాడుకోవటానికి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సంరక్షించుకోవటానికి ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాసంఘాలు, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంఘాలు... అందరూ కృషి చేయవలసిన అవసరాన్ని గణతంత్ర దినోత్సవం గుర్తుచేస్తున్నది.
వ్యాసకర్త : కె.ఎస్.లక్ష్మణరావు, శాసనమండలి సభ్యులు,
సెల్ : 9440262072