
- బొర్రా కిరణ్ ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
ప్రజాశక్తి-నందిగామ : దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాల కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్, పార్టీ తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపి కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజన సంక్షేమం కోసం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మైనార్టీ దళిత గిరిజన హక్కులను కాలరాస్తూ సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతోన్మాదం పాల్పడుతూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముగా వస్తుందని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ను ప్రైవేటు సెక్టార్గా మార్చి కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా ప్రభుత్వ సంస్థలను అమ్ముతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పకృతి సంపద ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి మద్యం సిండికేట్ పేరుతో తాడేపల్లి ప్యాలెస్ కు తరలించి దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాష్ట్రంలో మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు రద్దు చేయడం జరుగుతుందన్నారు. రూ. 500 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు నెలకు 6000 సహాయం చేయడం జరుగుతుంది అన్నారు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. నందిగామ నియోజవర్గంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ముఖ్యంగా నందిగామ పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేస్తామని చెప్పారు. నందిగామలో మౌలిక వసతులు కల్పనలో నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విఫలమైనారని పేర్కొన్నారు. నందిగామ నియోజవర్గంలో ఎత్తిపోతల పథకాలు మరమ్మత్తులు ప్రభుత్వం బాధ్యత వహించి చేపట్టాలని వేదాద్రి ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతులు చేయించి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్పి సాగర కాలవలు ద్వారా నందిగామ నియోజకవర్గంలో చివరి భూములు వరకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ నాయకులు పాలేటి సతీష్, నందిగామ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపు నరేంద్ర, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్ల శ్యామ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గింజపల్లి అనిల్, పల్లా అంతయ్య, ఎస్సీ ఎస్టీ సే సెల్ జిల్లా చైర్మన్ మందా వజ్రయ్య ,లీగల్ సెల్ జిల్లా చైర్మన్ న్యాయవాది రత్నకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరకొండ శ్రీనివాసరావు, జయరాజు, కోట రవీంద్ర, పెసరవెల్లి శ్యాం, వెంకటేశ్వరరావు, శ్రీహరి పలువురు కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.