Oct 30,2023 15:10

విజయనగరం: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని చెప్పారు. సంఘటన ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగితే 7.30 గంటలకే తాము అక్కడికి చేరుకకున్నామన్నారు.
ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 29 మంది కి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. ''ప్రమాదంలో 13 మంది చనిపోయారు. అందులో ఒకరు రైల్వే ఉద్యోగికావడం వల్ల.. ఆయన మృతదేహం రైల్వేశాఖ స్వాధీనంలో ఉంది. మిగతా 12 మృతదేహాలను సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చాం. వాటిలో ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఆయా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. ఘటనపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఆయన సూచన మేరకు మఅతుల కుటుంబాలకు ?10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ?2 లక్షలు, చిన్న చిన్న గాయాలు తగిలిన వారికి ?50 వేలు చొప్పున పరిహారం ప్రకటించాం'' అని బొత్స వెల్లడించారు. మంత్రి బొత్స వెంట డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఉన్నారు.