Jul 15,2023 22:43
  • చంద్రయాన్‌-3 విజయవంతంలో 3 కేరళ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర
  • ఈ మిషన్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది : కేరళ పరిశ్రమలశాఖ మంత్రి పి రాజీవ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : శ్రీహరికోట నుండి చంద్రయాన్‌-3 విజయవంతం కావడంలో కేరళ తన ప్రత్యేకత చాటుకుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్‌యులు) కీలకపాత్ర పోషించాయి. చంద్రునిపై భారతదేశం మూడో మిషన్‌ను పంపడంలో మూడు రాష్ట్ర పిఎస్‌యులు సహాయపడ్డాయి. మిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేరళ స్టేట్‌ ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కెఎస్‌ఇడిసి)కి చెందిన కెల్ట్రాన్‌, కేరళ మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ లిమిటెడ్‌ (కెఎంఎంఎల్‌), స్టీల్‌ అండ్‌ ఇండిస్టియల్‌ ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐఎఫ్‌ఎల్‌), తిరువనంతపురం ఆధారిత కోర్టాస్‌ ఇండిస్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారుచేసిన వివిధ ఉత్పత్తులు ఈ మిషన్‌లో ఉపయోగించారు. 'ప్రపంచం ముందు భారతదేశం సగర్వంగా నిలుస్తోంది. ఈ మిషన్‌లో భాగమైనందుకు కేరళకు కూడా గర్వంగా ఉంది' అని కేరళ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి పి రాజీవ్‌ అన్నారు. కెల్ట్రాన్‌ 41 ఎలక్ట్రానిక్‌ మాడ్యూళ్లను అందించగా, కెఎంఎంఎల్‌ టైటానియం స్పాంజ్‌ మెటల్‌ను అందించింది. ఇది క్లిష్టమైన భాగాలను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఎస్‌ఐఎఫ్‌ఎల్‌ టైటానియం, అల్యూమినియం ఫోర్జింగ్‌లు, ఇతర భాగాలు అందించింది. వెలిలోని ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతంలో ఉన్న ఏరోస్పేస్‌ తయారీ సంస్థ కోర్టాస్‌ ఇండిస్టీస్‌ మిషన్‌ వివిధ దశల కోసం అనేక విడి భాగాలను అందించింది.
నాలుగు సంస్థలు వివిధ ప్రాజెక్టుల కోసం భాగాలను అందించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో అనుబంధం కలిగి ఉన్నాయి. అంతరిక్ష ఎలక్ట్రానిక్స్‌లో 30 ఏళ్ల అనుభవం ఉన్న కెల్ట్రాన్‌, ఈసారి ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎల్‌విఎం-3పై ఇంటర్‌ఫేస్‌ ప్యాకేజీలు, ఏవియానిక్స్‌ ప్యాకేజీలు, చంద్రయాన్‌ కోసం పవర్‌ మాడ్యూల్స్‌, ఇతర పరీక్ష, మూల్యాంకన మద్దతును అందించింది. అల్లారు ఫోర్జింగ్‌లను రూపొందించడంలో ఎస్‌ఐఎఫ్‌ఎల్‌ నైపుణ్యాన్ని ఇస్రో బాగా ఉపయోగించుకుంది. ఇస్రో నాణ్యతా నియంత్రణ ప్రమాణాల ప్రకారం అసెంబ్లింగ్‌, ఫ్యాబ్రికేషన్‌ ప్రక్రియలను నిర్వహించడంతో కెల్ట్రాన్‌ మిషన్‌లో భాగమైంది. కరకులంలో కెల్ట్రాన్‌ ఎక్విప్‌మెంట్‌ కాంప్లెక్స్‌, తిరువనంతపురంలోని మన్విలాలోని కెల్ట్రాన్‌ కమ్యూనికేషన్‌ కాంప్లెక్స్‌ ఈ ప్రాజెక్ట్‌ వెనుక ఉన్నాయి.
'కెల్ట్రాన్‌ 300లో దాదాపు 50 ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను చాలా ఉపగ్రహ ప్రయోగ ప్రక్రియలో అందిస్తుంది. దీని ద్వారా అంతరిక్ష రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో కెల్ట్రాన్‌ కూడా భాగమవుతోంది' అని పిఎస్‌యు ఒక ప్రకటనలో తెలిపింది.
కొల్లంలోని చవరాలో కెఎంఎంఎల్‌ టైటానియం స్పాంజ్‌ ప్లాంట్‌ భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఈ ప్లాంట్‌ 2011లో ప్రారంభించబడింది. అవాంతరాలు ఉన్నప్పటికీ, పిఎస్‌యు చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3 రెండింటికీ టైటానియం స్పాంజ్‌ను అందించగలిగింది. 'కెఎంఎంఎల్‌ మెగ్నీషియంను వేరు చేయడానికి మెగ్నీషియం క్లోరైడ్‌ను రీసైక్లింగ్‌ చేసే ప్రక్రియలో ఉంది. విక్రమ్‌ సారాభారు స్పేస్‌ సెంటర్‌, డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ లాబరేటరీతో పాటు, నావికాదళం కూడా ఇప్పుడు మా ఉత్పత్తిపై ఆసక్తిని కనబరిచాయి' అని కెఎంఎంఎల్‌ అధికారి ఒకరు తెలిపారు.
త్రిసూర్‌కు చెందిన ఎస్‌ఐఎఫ్‌ఎల్‌ ప్రభుత్వ రంగంలో ఏకైక ఫోర్జింగ్‌ కంపెనీగా తన ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించి విభిన్న ఉత్పత్తులను సరఫరా చేసింది. పిఎస్‌యు దేశీయంగా ఎల్‌విఎం-3, విభజన వ్యవస్థ, వికాస్‌ ఇంజిన్‌ (ద్రవ ఇంధన రాకెట్‌ ఇంజిన్‌), సిఇ-20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ (ఎల్‌విఎం-3 లాంచ్‌ వెహికల్‌ క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌కి శక్తినివ్వడం) కోసం వివిధ భాగాలను అభివృద్ధి చేసింది. ఇది ఇస్రో మ్యాన్‌ స్పేస్‌ మిషన్‌ అయిన గంగాన్యాన్‌ కోసం సంక్లిష్టమైన ఫోర్జింగ్‌లకు కూడా దోహదపడుతోంది. కోర్టాస్‌ ఇండిస్టీస్‌ కూడా పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌విఎంకె-2, ఎల్‌విఎం-3 వంటి లాంచ్‌ వెహికల్స్‌, మ్యాన్‌-స్పేస్‌ మిషన్ల కోసం అత్యంత క్లిష్టమైన వ్యవస్థలను సరఫరా చేసింది.