Jun 07,2023 14:38

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌జిల్లా) : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మే 31 నుండి జూన్‌ 9వ తేదీ వరకు జరిగే రాష్ట్ర ప్రచార జాత బుధవారం నందిగామ మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ పారిశుద్ధ కార్మికులు ఎంప్లాయిస్‌ సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు దాటినా కూడా పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు పెంచకపోవడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆప్కాస్‌ విధానం తీసుకొచ్చి పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, కార్మికుల ఉద్యోగులుగా చూపిస్తూ సంక్షేమ పథకాల పూర్తిగా ఎత్తివేయటం హేయమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా సేవలందించిన పారిశుద్ధ కార్మికుల కాళ్ళు కడిగి కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా ఎత్తివేశారని విమర్శించారు. మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ ఆప్కాస్‌ సిబ్బంది పర్మినెంట్‌ చేయాలని, మున్సిపల్‌ ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేయాలని పాత పెన్షన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోనే 123 కార్పొరేషన్‌ లో మున్సిపాలిటీలు నగర పంచాయతీలు దాదాపుగా 40 వేల మంది పైగా కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ ఆప్కాస్‌ సిబ్బంది మరో పదివేలపైగా సిపిఎస్‌ ఉద్యోగులు , పదివేల మంది పైగా క్లాత్‌ ఆటో డ్రైవర్‌ పనిచేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కోవిడ్‌ వారియర్స్‌గా ఫ్రంట్‌ లైన్‌ లో కొరియర్స్‌ గా ప్రాణాలు తెగించి ప్రజలకు సేవలు చేశారని, వీరికి 010 పొద్దు ద్వారా జీతాలు చెల్లింపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సిపిఎస్‌ రద్దు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి నూకరాజు, రాష్ట్ర నాయకులు జీ లక్ష్మి, నాయుడు, ఎన్టీఆర్‌ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్‌ శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి ఎ. కమల, నందిగామ సిఐటియు కార్యదర్శి కే.గోపాల్‌, నందిగామ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సాల్కేట్‌ నరేష్‌, సైదా, మాణిక్యం, పిచ్చయ్య, గరికపాటి ప్రసాద్‌, రుతుమ, బేబీ, రాజరత్నం, నతానీలు కార్మికులు పాల్గొన్నారు.