
ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొస్తోంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యగా పేర్లు పెట్టి లోక్సభలో ప్రవేశపెట్టింది. వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపుతామని, ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప జేస్తామని ప్రకటించింది. ఈ బిల్లులు పార్లమెంటరీ ప్రక్రియల అనంతరం త్వరలోనే చట్టరూపం దాల్చే అవకాశముంది. 'బ్రిటీష్ నాటి కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాం. రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తున్నాం.' అని పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, బిల్లుల్లోని అంశాలపై ప్రజలతో సంప్రదింపులు, సిఫార్సుల కోసం 2020 మే లో నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశామని సర్కారు చెబుతున్నది. అయితే సంప్రదింపుల ప్రక్రియ విధి విధానాలు, అభ్యర్థనల పరిశీలన, విశ్లేషణపై నిపుణుల సంఘం అనుసరించిన పద్ధతులపై ఇప్పటికీ స్పష్టత లేదు. అంతేకాకుండా నిపుణుల సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫారసులను సైతం బయటపెట్టలేదు. దీంతో సరైన సంప్రదింపులు జరప కుండా, న్యాయ నిపుణుల సలహాలు, అభ్యంతరాలను పరిగణన లోకి తీసుకోకుండా కొత్త చట్టాలను తీసుకొస్తున్నారని విపక్షాల విమర్శ. రాజకీయ ప్రయోజనాల కోసమే వీటిని తీసుకొచ్చారని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని టార్గెట్గా చేస్తూ...ఎవరూ నోరెత్తకుండా చేయడానికి వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదముందని చెబుతున్నాయి. మరోవైపు పోలీసులకు కల్పిస్తున్న అధికారాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవని పేర్కొంటున్నాయి.
రాజద్రోహాన్ని రద్దు చేసినా...
వలసవాద చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకువస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతు న్నది. ముఖ్యంగా ఐపిసి లోని 124 (ఏ) రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే ఇదే స్థానంలో 'భారతీయ న్యాయ సంహిత'లో 150 సెక్షన్ను మరింత కఠినంగా తయారు చేసినట్లు స్పష్టమవుతున్నది. అంతేకాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) లోని అంశాలన్నీ కూడా కొత్త బిల్లులో వుంచారు. ఈ కొత్త బిల్లులో ఉన్న వేర్పాటువాదం అన్న మాటకు నిర్వచనం ఎక్కడా చెప్పలేదు. కొత్త బిల్లుల్లో చేసిందల్లా దేశద్రోహం లేదా రాజద్రోహం అన్న మాటను తొలగించడం మాత్రమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు అధికారాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం....
గతంలో సిఆర్పిసి కింద అరెస్టయిన వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజులు మాత్రమే పోలీస్ కస్టడీలో ఉంచుకునే అవకాశముండేది. కానీ కొత్త చట్టాల్లో చేసిన నేరాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీని పొడిగించవచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేరం చేసి సంపాదించిన సొమ్ముతో కూడగట్టిన ఆస్తిగా విచారణాధికారి భావిస్తే వాటిని అటాచ్ చేసే అధికారం కూడా వారికి ఇచ్చారు. విచారణలో భాగంగా డిజిటల్ ఆధారాలైన ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేయవచ్చు. అంతేకాకుండా అండర్ ట్రయల్స్లో ఉండి సగం శిక్షను అనుభవించిన వారికి మాత్రమే తప్పనిసరి బెయిల్ పొందే వీలుంది. ఇలాంటివి దుర్వినియోగమయ్యే ముప్పు ఎక్కువగా ఉంది. దీంతో అధికారంలో ఉన్న వారు తమను వ్యతిరేకించే వారిని ఏదోలా శిక్షించే వెసులుబాటు లభించే అవకాశముంది. 'విపక్షాల నోరు నొక్కేయాలన్న ప్రధాన ఎజెండాతోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత బిల్లును తీసుకొచ్చింది.' అని ఇప్పటికే మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. 'ఈ చట్టం పోలీసులకు క్రూరమైన అధికారాలను కట్టబెడుతున్నది.
వీటిని అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటాయి' అని ఆరోపించారు. 'ఐపిసి, సిఆర్పిసి చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం. దీనివల్ల పోలీసు రాజ్యం ఏర్పడుతుంది.' అని సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అభిప్రాయపడ్డారు.
హిందీ పేర్లతోనూ సమస్య
ఐపిసి, సిఆర్పిసి వంటి ఇంగ్లీష్ పేర్ల స్థానంలో సంస్కృతంతో కూడిన హిందీలో కొత్త చట్టాలకు ప్రభుత్వం పేరు పెట్టింది. హిందీ పేర్లు పెట్టడానికి ఇప్పటికే డిఎంకే తన వ్యతిరేకతను తెలియజేసింది. న్యాయ ప్రక్రియ అంతా ఇంగ్లీషులో సాగుతున్నప్పుడు చట్టాలకు హిందీ పేర్లు పెట్టడంవల్ల లాభమేమిటనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే దేశం మీద హిందీని బలవంతంగా రుద్దాలనే ప్రక్రియలో భాగంగానే హిందీలో పేర్లు పెడుతున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి. 'హిందీ పేర్లు పెట్టడం అర్థం లేని పని' అని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ విమర్శించారు.
చట్టాల లక్ష్యం నెరవేరాలంటే...
నేరాలు జరగకుండా నియంత్రించడానికి శిక్ష అనేది అవసరం. అయితే నేరస్థుల్లో పరివర్తన తీసుకురావడమే ఆ శిక్ష లక్ష్యం కావాలి. ఎంత పకడ్బందీగా, కఠినంగా చట్టాలను రూపొం దించినా...వాటిని అమలు చేస్తున్న వారి ఉద్దేశ్యమే చట్టాల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. నిందితుల్లోనే కాదు..చట్టాలను అమలు చేసే వారిలో కూడా పరివర్తన వస్తేనే చట్టాల అసలు లక్ష్యం నెరవేరుతుంది. 'వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు' అనేది న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రంగా చెబుతుంటారు. అలాంటి పద్ధతిలో చట్ట వ్యవస్థ నిర్మాణమైతేనే ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. అయితే కొత్త చట్టాలు రూపొందించడంతో, కేసుల పరిష్కారంలో టైమ్ లిమిట్ పెట్టడంతోనే సత్వర న్యాయం అనేది సాధ్యం కాదు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే ముందుగా కోర్టుల్లో న్యాయమూర్తులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. కొత్త బిల్లుల రూపకల్పన అనేది పకడ్బందీగా జరగాలి. అందుకోసం సర్కారు మరింత కసరత్తు చేయాలి. పార్లమెంట్లో క్షుణ్ణంగా చర్చించాలి. విపక్షాలు, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి. ఆ తర్వాతే ముందడుగు వేయాలి.
వ్యాసకర్త : ఫిరోజ్ ఖాన్, సెల్: 9640466464 /