
సంక్షోభంలో ఉన్న బ్రిటన్ నూతన ప్రధానిగా మంగళవారం నాడు నియమితులైన కన్సర్వేటివ్ పార్టీ (టోరీ) నాయకురాలు లిజ్ ట్రస్ తక్షణమే రంగంలోకి దిగుతారు అంటూ అక్కడి మెజారిటీ పత్రికలు, ఆమె గెలిచారు గానీ రానున్న సంక్షోభాన్ని నివారించగలరా అన్న సందేహాలతో కొన్ని ఆమె గురించి శీర్షికలు పెట్టాయి. ద్రవ్యోల్బణం ఇతర ఆర్థిక దిగజారుడు కారణంగా జీవితాలు గడపటం కష్టమైన కార్మికులు సమ్మెలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడవచ్చని భావిస్తున్నారు. బ్రిటన్ తదుపరి ఎన్నికలు 2025 జనవరి 28న జరగాల్సిన పూర్వరంగం లో లేబర్ పార్టీ నుంచి ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆమె ఎలాంటి చర్యలతో కార్యాచరణకు పూనుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. జీవన వ్యయ పెరుగుదల నుంచి బ్రెగ్జిట్ అనంతర పరిస్థితి, ఉక్రెయిన్ సంక్షోభం వరకు అనేక అంశాలు ఆమె ముందున్నాయి. గతంలో ఉక్కు మహిళగా పేరు గాంచిన మార్గరెట్ థాచర్ తరువాత ఇన్ని సమస్యలతో గద్దెనెక్కిన వారు మరొకరు లేరు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ను పార్టీ ఎన్నికల్లో ఓడించిన లిజ్ ఆరు సంవత్సరాల్లో నాలుగవ ప్రధాని. అక్కడి సంక్షోభానికి ఇన్ని ప్రభుత్వాలు మారటం ఒక సూచిక.
జనానికి ఉపశమనం కలిగిస్తే తమ వాటా తగ్గుతుందని కార్పొరేట్లకు ఆగ్రహం, లేకపోతే జనాందోళనలు మరింత ఉధృతం కావటం తధ్యం. ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంథన ఛార్జీల విధానాన్ని స్థంభింపచేసి 2,300 డాలర్లు, అంతకు లోపు చెల్లిస్తున్న గృహ వినియోగ దారులకు వచ్చే ఎన్నికల వరకు బిల్లులు పెరగకుండా చేసేందుకు 130 బిలియన్ డాలర్లతో ఒక పథకాన్ని రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. తొలిసారిగా బ్రిటన్ చరిత్రలో శ్వేతజాతికి చెందిన వారినెవరినీ ప్రధాన మంత్రి పదవుల్లోకి తీసుకోకూడదని లిజ్ భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. జాత్యహంకార పార్టీ అన్న ముద్రను తొలగించుకొనేందుకు, శ్వేతేతర జాతుల వారి ఓట్ల కోసం ఇదంతా అన్నది స్పష్టం. లిజ్-సునాక్ మధ్య పోటీలో కూడా శ్వేతజాతి ఆధిపత్య భావజాలం పని చేసిం దన్నది స్పష్టం. మంత్రులుగా ఎవరున్నా రన్నది ప్రధానం కాదు, ప్రభుత్వ విధానాలు ఏమిటన్నదే గీటురాయి. మరో టోరీ ప్రధాని అని తప్ప లిజ్ ట్రస్ విధానాల మీద కార్మికుల్లో ఎలాంటి భ్రమలు లేవు.
ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఎన్నికల ప్రచారంలోనే ఆమె ధనికులకు అనుకూలమైన అంశాల గురించి స్పష్టంగా చెప్పారు. అధికాదాయం ఉన్నవారికి పన్నులు తగ్గించటం న్యాయం అన్నారు. వచ్చే ఏడాది కార్పొరేట్ పన్నును 19 నుంచి 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవచ్చు. బీమా పథకాల్లో ఆమె ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం పేదలకు ఏడాది 7.66 పౌండ్లు మాత్రమే లబ్ధి కాగా ధనికులకు 1,800 పౌండ్లు మిగులుతాయి. బ్రిటన్లో కార్మికవర్గంతో పాటు పెట్టుబడిదారీ విధానం కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నది. దాని భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు పూనుకుంది. ఐరోపా సమాఖ్యలో కొనసాగటం కంటే వెలుపల ఉంటేనే తమకు ఎక్కువ లబ్ధి అని అక్కడి కార్పొరేట్లు భావించిన కారణంగానే దాన్నుంచి వెలుపలికి వచ్చింది. వాటికి మార్కెట్ను సంపాదించి పెట్టటం లిజ్ సర్కార్కు పెద్ద పరీక్ష కానుంది. ఇదే తరుణంలో కరోనా, ఉక్రెయిన్ తదితరాల కారణంగా తలెత్తిన సమస్యల నుంచి బయట పడటం అంత తేలికేమీ కాదు. గత దశాబ్దన్నర కాలంగా బ్రిటన్ పెట్టుబడిదారులు ప్రభుత్వం మీదనే ఎక్కువగా ఆధారపడ్డారు.
నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియ జరుగుతుం డగానే బ్రిటన్లో వివిధ రంగాల్లోని కార్మికులు సమ్మెలకు పూనుకున్నారు. ఈ నెల 15న పన్నెండు కంపెనీలకు చెందిన 40 వేల మంది రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. పొదుపు పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా, ప్రభుత్వ సేవలను పరిరక్షించాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతోంది. తరువాత కూడా వివిధ తేదీలలో రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. రైల్వే కార్మికులకు వేతన స్థంభన లేదా వేతన కోతల ప్రతిపాదనలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో బ్రిటన్లో కార్మికుల జీవన పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏప్రిల్ నాటికి ఇంథన బిల్లులు 50 శాతం పెరిగ్గా, అక్టోబరు నాటికి 80 శాతానికి చేరనున్నాయి. గత వేసవిలో సగటున 1,277 పౌండ్ల మేర బిల్లులు రాగా ఈ ఏడాది 3,549 పౌండ్లకు పెరగనున్నా యి. ఇవి ముందుగా బిల్లు చెల్లించే వారికి, తరువాత కట్టే పేదవారికి 3,608 పౌండ్లకు పెరుగుతాయి. గృహస్తులకే గాకస్కూళ్లు, సంరక్షణ కేంద్రాలు, చిన్న దుకాణాలు అన్నింటికీ పెరగనున్నాయి. వచ్చే జనవరి తరువాత మరింతగా పెరుగుతాయి. మొత్తం 70 లక్షల పేద కుటుంబాల మీద దీని ప్రభావం పడనుంది. ఇంథన దారిద్య్రాన్ని అంతమొందించాలనే ఉద్యమ సంస్థ అంచనా ప్రకారం రాబడిలో పది శాతాన్ని ఖర్చు చేస్తున్నారని, 105 లక్షల కుటుంబాల మీద ప్రభావం ఉందని పేర్కొన్నది. మరొక అంచనా ప్రకారం 2023 జనవరి నాటికి ఇంథన దారిద్య్రంలో మూడింట రెండు వంతుల కుటుం బాలు కూరుకుపోతాయి. జనం కంటే ఇంథన కంపెనీల లాభాలను కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఒకవైపు జనం ఇబ్బందు లు పడుతుంటే బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చేందుకు ఆగస్టు15 నాటికి 2.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
రానున్న రోజుల్లో ఆహార, ఆరోగ్య సంక్షోభం కూడా పెరగనుంది. 2009-10లో బ్రిటన్ లోని స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందచేసేవి నామమాత్రం. వాటిలో ఒకటైన ట్రస్సెల్ ట్రస్టు 35 కేంద్రాలను నిర్వహించి 61 వేల ఆహార పొట్లాలను అందచేసింది. తరువాత 2019-20 నాటికి కేంద్రాలు 1,400కు పెరగ్గా పది లక్షల 90 వేలకు, 2020-21లో 26 లక్షలు, 2021-22లో 22 లక్షల ఆహార పొట్లాలు అందచేసింది. కరోనాకు ముందు దేశంలోని నాలుగు శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార భద్రత సమస్యను, మరో నాలుగు శాతం పరిమితమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు వెల్లడించాయి. ఆహార కేంద్రాలు ఎక్కువ భాగం చర్చిలలో ఉండటంతో కొంత మంది ఆకలిని భరించటానికి ఇష్టపడ్డారు తప్ప అక్కడికి వెళ్లేందుకు సిగ్గుపడ్డారని...కేంద్రాలు దూరంగా ఉండటం, అవి తెరిచే సమయాలు అనువుగా లేకపోవడం వలన కూడా కొందరు వెళ్లటం లేదని వెల్లడైంది. గత పన్నెండు నెలల్లో సర్వే చేసి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారినట్లు తేలి ఉండేదని అమెరికా సర్వే సంస్థ ఒకటి పేర్కొన్నది. జీవన వ్యయం పెరుగుతున్న కొద్దీ ఈ కేంద్రాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నది.
లిజ్ ట్రస్ సారథ్యంలో భారత్-బ్రిటన్ సంబంధాలు ఎలా ఉంటాయని కొందరు చర్చ ప్రారంభించారు. గతంతో పోలిస్తే పెద్ద మార్పులు ఉండే అవకాశాలు లేవు. తమ వస్తువులకు మన మార్కెట్ను తెరవాలంటూ గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న వత్తిడి కొనసాగనుంది. ద్రవ్యోల్బణం దాని తరువాత మాంద్యంలోకి జారనుందనే పరిస్థితిలో మన ఎగుమతులైన వస్త్రాలు, దుస్తులు, ఆభరణాల వంటి వాటికి ఏ మేరకు డిమాండ్ ఉంటుందో చెప్పలేం. 2020-21లో ఇరు దేశాల లావాదేవీలు 13.2 నుంచి మరుసటి ఏడాది 17.5 బి.డాలర్లకు పెరిగాయి. మన ఎగు మతులు 10.5 బి.డాలర్లు కాగా దిగుమతులు ఏడు బిలియన్ డాలర్లు. రెండు దేశాల మధ్య కస్టమ్స్ సుంకాలను భారీగా తగ్గించాలని రెండు దేశాలూ భావిస్తున్నాయి. దీపావళి నాటికి రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు. ఆర్థికంగా ఐరోపా సమాఖ్య నుంచి దూరమైన బ్రిటన్ అంతర్జాతీయ మార్కెట్ల వేటలో అమెరికాతో జతకట్టటం తప్ప మరొక మార్గం లేదు.
ఎం. కోటేశ్వరరావు