Sep 04,2023 15:29

ప్రజాశక్తి-డుంబ్రిగుడ(అనంతపురం) : ప్రభుత్వ శాఖల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించిన జీఒ నెంబర్‌ 3 ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గిరిజనులు ఉద్యోగాలు కోల్పోయారని సిపిఎం అల్లూరి జిల్లా కార్యవర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో స్థానిక సిపిఎం నాయకులు మూడు రోడ్ల జంక్షన్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ఆందోళన చేపట్టారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్‌ సిహెచ్‌ నాగమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన చట్టాలను, హక్కులను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా కాల రాస్తుందని విమర్శించారు. వంట గ్యాస్‌తో పాటు నిత్యవసర సరుకు ధరలను భారీగా పెంచడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపిందన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, మత తత్వాలను రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.