Oct 19,2023 14:15
  •  పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు

న్యూయార్క్‌: గాజాలో ఆల్‌ రిహ్లా ఆస్పత్రి దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసింది. యుద్ధాన్ని నిలిపివేయాల్సిందిగా ప్రపంచదేశాలు ఇరుపక్షాలను కోరాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పాలస్తీనా అనుకూల నిరసనకారులు అమెరికాలో ఆందోళన చేపట్టారు. యూదు సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొని క్యాపిటల్‌ బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. నిరసనలకు అనుమతి తీసుకోకుండానే బిల్డింగ్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. నిరసనల్లో దాదాపు 300 మంది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇజ్రాయెల్‌లో నిన్న బైడెన్‌, నేడు రిషి సునాక్‌ పర్యటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి ఘటనలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతూనే కాల్పుల విమరణకు ఒప్పించే ప్రయత్నం చేశారు. జో బైడెన్‌ పర్యటన అనంతరం బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా నేడు ఇజ్రాయెల్‌ సందర్శించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో యుద్ధం పరిస్థితులపై చర్చించనున్నారు. అటు.. బైడెన్‌ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్‌ కాస్త పట్ట సడలించినట్లు తెలుస్తోంది. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు ఆహారం, నీటిని రఫా సరిహద్దు గుండా అందించడానికి అంగీకరించింది.