
గాజా : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. గాజా స్ట్రిప్లో హమాస్పై దాడి ''ఇప్పుడే ప్రారంభమైంది'' అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. సోమవారం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్ దేశం.. సుమారు 300,000 మంది సైనికులను సిద్ధం చేసింది. దీంతో హమస్ దాడికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులను ప్రారంభించింది. సోమవారం అర్ధరాత్రి భారీ ఎత్తున యుద్ధ విమానాలతో దాడులు చేసింది. దీంతో హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన దాదాపు 1500 మంది తీవ్రవాద మిలిటెంట్ల మృతదేహాలు లభ్యమైనట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. అలాగే నిన్న రాత్రి హమాస్ తీవ్రవాదులు.. ఇజ్రాయెల్పై భారీ ఎత్తున రాకెట్ల దాడి చేశారు. అయితే ఇజ్రాయెల్కు ఉన్న అత్యాధునిక డ్రోన్, సెన్సార్ టెక్నాలజీ వల్ల వాటిని ఆకాశంలోనే పేల్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.