Jan 08,2023 12:41
  • భారత టెకీ ఉద్యోగార్థులో నిరాశలు
  • తొలగింపులతో ఆందోళనలు

హైదరాబాద్‌ : అమెరికాన్‌ టెక్‌ దిగ్గజ కంపెనీలు వరసగా ఉద్యోగులను తొలగించడంతో భారత టెకీల్లో గుబులు మొదలయ్యింది. మరోవైపు కొత్త నియామకాలను దాదాపుగా నిలిపి వేశాయి. దీంతో ఆ దేశంలో ఐటి ఉద్యోగం పొందాలనే అభ్యర్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం భయాలు అమెరికన్‌ కంపెనీలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అమెజాన్‌, సేల్స్‌ఫోర్స్‌, మెటా, ట్విట్టర్‌, ఉబెర్‌ లాంటి దిగ్గజ కంపెనీలు భారీ సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించగా.. కొత్త నియామకాలను దాదాపు నిలిపివేసినట్లు వెల్లడించాయి. దీంతో అమెరికన్‌ కంపెనీలపై భారత టెకీలు పెట్టుకున్న కలలు కల్లలుగా మారుతున్నాయి.
            గడిచిన మూడు మాసాల్లో టెక్‌ పరిశ్రమల్లో తొలగించ బడిన ఉద్యోగుల్లో దాదాపుగా 21 శాతం మందికి ఇప్పటికీ ఉద్యోగులు లభించలేదని ఓ సర్వేలో వెల్లడయ్యింది. ఐటి పరిశ్రమలో 2023 అత్యంత చెత్త సంవత్సరంగా మారనుందని ఆ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపై హెచ్‌-1బి వీసాలు ఉన్నప్పటికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 చివరిలో అనేక మంది భారతీయ సంతతికి చెందిన ఉద్యోగులు నష్టపోయారు. అమెజాన్‌, సేల్స్‌ఫోర్స్‌ తాజాగా ప్రకటించిన ఉద్యోగుల తొలగింపు జాబితాలో అతి త్వరలోనే గూగుల్‌ కూడా చేరనుందని సంకేతాలు వస్తోన్నాయి. అదే జరిగితే అనేక మంది హెచ్‌-1బి వీసాదారుల పరిస్థితి తీవ్ర అనిశ్చిత్తిలోకి నెట్టబడే అవకాశాలున్నాయి. వాళ్లు అక్కడ 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా కాకపోతే అమెరికా నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగ ఆధారిత వీసాలపై అమెరికా చార్జీలను పెంచుతుంది. హెచ్‌1-బి వీసా దరఖాస్తు ఫీజును 70 శాతం పెంచి 780 డాలర్లకు చేర్చింది. ఇది కూడా ఉద్యోగార్థులకు భారం కానుంది. అమెరికన్‌ ఐటి దిగ్గజాలు అయినా అమెజాన్‌లో 10,000 మంది, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో 11,000 మంది, గూగుల్‌ మాతృసంస్థ అల్పాబెట్‌లో 10వేలు, ట్విట్టర్‌లో 5,500 మంది చొప్పున ఉద్యోగాల తొలగింపునకు ఇప్పటికే ప్రకటనలు ఇచ్చాయి. ఈ తొలగింపులు గత ఆరు నెలల నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఉన్న ఉద్యోగాలు ఊడటం, కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ రంగంలోని ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.