Oct 03,2023 20:00

'శేఖర్‌ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్‌ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్‌ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని' అంటూ నటి హరితేజ వెల్లడించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయిపల్లవి అక్క పాత్రను శరణ్య ప్రదీప్‌ పోషించారు. అయితే, ఈ పాత్ర కోసం నటి హరితేజ ఆడిషన్‌కు వెళ్లారట. 'మామా మశ్చీంద్ర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సుధీర్‌ బాబు త్రిపాత్రాభినయంలో హర్షవర్ధన్‌ తెరకెక్కించిన 'మామా మశ్చీంద్ర'లో హరితేజ కీలక పాత్ర పోషించారు. ఈనెల ఆరోతేదీన ఈ సినిమా విడుదలకానుంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరోలు విశ్వక్‌ సేన్‌, శర్వానంద్‌, దర్శకుడు శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.