Jul 10,2023 22:31

న్యూఢిల్లీ : ఫోర్బ్స్‌ సంపన్న మహిళల జాబితా-2023లో నలుగురు భారతీయాఅమెరికన్‌ వనితలకు చోటు దక్కింది. ఈ జాబితాలో జయశ్రీ ఉల్లాల్‌, నీర్జా సేథి, నేహా నార్ఖేడే, ఇంద్ర నూయి ఉన్నారు. అమెరికాలో అత్యంత విజయవంతమైన, సగటు సంపద 124 బిలియన్‌ డాలర్లు కలిగిన వంద మంది మహిళా వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌ల సరసనన వీరు నిలిచారు. వీరి సంపద గత ఏడాది కంటే 12 శాతం పెరిగింది. టెక్‌ దిగ్గజం సిస్కో మాజీ నిపుణురాలు జయశ్రీ ఉల్లాల్‌ 2.2 బిలియన్‌ డాలర్ల సంపదతో 15వ స్థానంలో నిలిచారు. సింటెల్‌ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి 990 మిలియన్‌ డాలర్ల సంపదతో 25వ స్థానంలో ఉన్నారు. ఇన్‌ప్లూయెంట్‌ ఫౌండర్‌ నేహా నార్ఖడే 520 మిలియన్‌ డాలర్లతో నికర ఆస్తులతో 50వ స్థానంలో నిలిచారు. పెప్సీకో మాజీ ఛైర్మన్‌, సిఇఒ ఇంద్రా నూయి 350 మిలియన్‌ డాలర్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు.