Oct 11,2023 21:47

- మిల్లెట్స్‌ వినియోగంపై ప్రజలకు అవగాహన
- ప్రతి ఆర్‌బికెనూ యూనిట్‌గా తీసుకుని టిఎంఆర్‌ ఇచ్చేలా చూడాలి
- సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:రైతుల నుంచి తృణ ధాన్యాల కొనుగోలును పెంచేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్టను ఏర్పాటుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోని యూనిట్లను ఉపయోగించుకుని ఈ మిల్లెట్స్‌ను ప్రాసెస్‌ చేయాలన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయం, అనుబంధ రంగాలు, పౌరసరఫరాలశాఖలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిడిఎస్‌ ద్వారా మిల్లెట్స్‌ను ప్రజలకు పంపిణీ చేయాలని, మిల్లెట్స్‌ వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలని సూచించారు. ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిఎల్‌టి రూపంలో క్వింటాకు సుమారు రూ.250లపైనే అదనంగా రైతులకు లభిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలని సిఎం ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు మిల్లర్లను ఆశ్రయించాల్సిన అవసరం రాకూడదన్నారు. ఆర్‌బికెల స్థాయిలో భూసార పరీక్షలు చేసేలా అధికారులు అడుగులు వేయాలన్నారు. ఇందుకు అవసరమైన పరికరాలు ఆర్‌బికెల్లో ఉంచేలా చూడాలన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పంటవేసే ముందు భూసార పరీక్షలు జరగాలని, ఆ మేరకు సర్టిఫికెట్‌ ఇచ్చేలా ఉండాలని సిఎం చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఏ పంటలు వేయాలి? ఏయే రకాల ఎరువులు ఎంత మోతాదులో వేయాలన్న దానిపై రైతులకు పూర్తి వివరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
చేయూత కింద మహిళల కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాలని, సుస్థిర జీవనోపాధి మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ అంశంపై నిరంతరం సమీక్ష జరగాలని సిఎం పేర్కొన్నారు. చేయూత కింద ఇస్తున్న నగదుకు అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. అమూల్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటికే చాలా మంది లబ్ధి పొందుతున్నారని, మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు చూపాలన్నారు. పశుగ్రాసం కొరత లేకుండా చూసుకోవాలని, ప్రతి ఆర్‌బికెను యూనిట్‌గా తీసుకుని టిఎంఆర్‌ ఇచ్చేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కాకాణి గోవర్ధనరెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, ఎపి అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్‌రెడ్డి, సిఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సిఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, ఉద్యానవనశాఖ కమిషనరు ఎస్‌ఎస్‌ శ్రీధర్‌, ఎపి విత్తనాభివృద్ధి సంస్థ విసి అండ్‌ ఎమ్‌డి జి శేఖర్‌బాబు, పౌరసరఫరాలశాఖ కమిషనరు హెచ్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.