ఎన్టీఆర్ కథనాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దేవర'. జాన్వీకపూర్ కథానాయిక. శంషాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా అండర్వాటర్ సీక్వెన్స్ చిత్రీకరించారు. 'దీని కోసం రాత్రిం బవళ్లు టీమ్ కష్టపడుతోంది' అంటూ కెమెరామెన్ రత్నవేలు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సముద్రం మధ్యలో యాక్షన్ సన్నివేశాలను నైట్ మోడ్లో చిత్రీకరించాం. 'ఎన్టీఆర్పై సముద్ర గర్భం, ఉపరితలం స్థాయిలో కీలక సన్నివేశాలను పూర్తి చేశాం. అత్యంత కష్టమైన యాక్షన్ సన్నివేశమిది' అని తెలిపారు. టైటానిక్ షిప్ను తలపించేలా భారీ ఓడను, అండర్ వాటర్ సీన్స్ చిత్రీకరణ కోసం వంద అడుగులకు పైగా లోతైన సముద్రం లాంటి సెట్ను క్రియేట్ చేశారు. ఈ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.










