Jun 10,2023 11:29

లండన్‌ : 'పార్టీగేట్‌ కుంభకోణం' కేసులో ఇచ్చిన దర్యాప్తు నివేదిక కారణంగా బోరిస్‌ జాన్సన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పార్లమెంటు సభ్యుడు (ఎంపి) పదవికి కూడా రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం, ప్రివిలేజెస్‌ కమిటీ దర్యాప్తు నివేదిక కాపీని జాన్సన్‌ అందుకున్నారు. అదేరోజున ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రివిలేజెస్‌ కమిటీ దర్యాప్తు నివేదిక తనను ఎంపి పదవి నుంచి అన్యాయంగా బహిష్కరించేందుకు ప్రయత్నించిందని బోరిస్‌ అన్నారు. ఆ నివేదిక కారణంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని, పార్లమెంటును విడిచి వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ (పార్లమెంటు దిగువ సభ)ను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని చూపించడానికి కమిటీ తన నివేదికలో ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయిందని ఆరోపించారు. నివేదిక అబద్ధాలతో, పక్షపాతంతో నిండి ఉందని అన్నారు. మార్చిలో, కరోనా వైరస్‌ నిబంధనలను ధిక్కరించి స్నేహితులతో డిన్నర్‌ పార్టీని నిర్వహించడం ద్వారా తాను పార్లమెంటును తప్పుదారి పట్టించానని బోరిస్‌ విచారణ కమిటీ వద్ద అంగీకరించారు. అయితే ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని చెప్పారు.

                                                                    పార్టీ గేట్‌ స్కామ్‌ అంటే ...?

'పార్టీ గేట్‌ కుంభకోణం' కారణంగా 2022 జూలై 7న బోరిస్‌ తన ప్రధాని పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. 2020-21లో కరోనా మహమ్మారి సమయంలో, యుకె లో వివిధ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అప్పుడు ప్రధాని బోరిస్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన కార్యాలయంలో అనేక విందులు ఏర్పాటు చేశారు. దాని గురించి అతను ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని 'పార్టీ గేట్‌ స్కామ్‌' అంటారు.