ప్రజాశక్తి-తిరుపతి : తిరుమల కాలినడక మార్గంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జింకల పార్కు సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. మెట్ల మార్గంలో ఒక వైపు నుంచి మరో వైపు దాటి పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. గత నెలలో మూడు సంవత్సరాల బాలుడిపై చిరుత పులి దాడి చేసిన ఘటన మరవక ముందే.. ఇప్పుడు ఎలుగుబంటి ప్రత్యక్షం కావటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుత పులి దాడి అనంతరం అధికారులు ఆ చిరుతపులిని పట్టి బంధించగా.. ఇప్పుడు మళ్లీ ఎలుగుబంటి జాడలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భద్రత సిబ్బంది, అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.










