- ఫైనాన్సీయల్ టైమ్స్ వ్యతిరేక కథనం
లండన్ : అదాని గ్రూపునకు వ్యతిరేకంగా ప్రచురించిన ఓ కథనాన్ని తొలగించాలని ఫైనాన్సీయల్ టైమ్స్పై ఒత్తిడి తీసుకు రాగా.. ఆ సంస్థ నిర్విధ్వంగా తిరస్కరించింది. లండన్ కేంద్రంగా పని చేస్తున్న వ్యాపార వార పత్రిక ఫైనాన్సీయల్ టైమ్స్ (ఎఫ్టి) మార్చి 22న అదాని అక్రమ విదేశీ నిధులపై ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని వెబ్సైట్ నుంచి తొలగించాలని అదాని గ్రూపు ఏప్రిల్ 10న ఆ సంస్థకు లేఖ రాసింది. ''మా కథనం ఖచ్చితమైనది. జాగ్రత్తగా తయారు చేశాం. మేము మా రిపోర్టింగ్కు కట్టుబడి ఉన్నాము.'' అని ఎఫ్టి ప్రతినిధి టెలిగ్రాఫ్తో పేర్కొన్నారు. ''గౌతం అదానీ కంపెనీల్లోకి ఇటీవలి సంవత్సరాలలో దాదాపు సగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అతని కుటుంబానికి అనుసంధానించబడిన విదేశాల్లోని సంస్థల నుండి వచ్చాయి. ఈ నగదు ప్రవాహాన్ని పరిశీలించడం కష్టంగా ఉంది. అదానీలతో సంబంధమున్న విదేశీ కంపెనీలు 2017 నుంచి 2022 మధ్య కనీసం 2.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.21వేల కోట్లు) పెట్టుబడి పెట్టాయి. ఆ సమయంలో వచ్చిన మొత్తం 5.7 బిలియన్ డాలర్లలో దాదాపు సగం (45.4%)గా నమోదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్థి ఎజెండాతో తనను తాను కలుపుకుంటూనే అదాని ట్రేడింగ్, ప్లాస్టిక్ల కార్యకలాపాలను మౌలిక సదుపాయాల దిగ్గజంగా విస్తరించుకోవడానికి అస్పష్టమైన నిధులు సహాయపడ్డాయి. అదానీ గ్రూపులోకి కనెక్ట్ చేయబడిన ఆఫ్షోర్ సంస్థల నుండి పూర్తి స్థాయిలో డబ్బు ప్రవహిస్తుంది. విదేశీ పెట్టుబడిలో కొంత భాగాన్ని మాత్రమే ఎఫ్డిఐ డేటా బహిరంగం చేస్తుంది. సెప్టెంబర్ 2022 వరకు అధికారికంగా ఎఫ్డిఐగా నమోదు చేయబడిన సొమ్ములో అత్యధికంగా 6 శాతం డబ్బును స్వీకరించిన వాటిలో అదానీ గ్రూప్ ఒకటి.'' అని ఎఫ్టి తన కథనంలో పేర్కొంది. ఇది అదాని గ్రూపును ఆందోళనకు గురి చేసింది. దీంతో ఎఫ్టి వెబ్సైట్ నుంచి ఆ కథనాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తుంది.










