Nov 15,2023 09:03
  • అదానీ గ్రూపు ప్రాజెక్టులకు లైన్‌ క్లియర్‌ చేసేందుకే !
  • కేంద్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం

వడ్డించే వాడు మనవాడైతే.. ఏమూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలకు కొదవ ఉండదని నానుడి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉంది. పర్యావరణం ప్రగతికి ఎంతో కీలకమని చెప్పే బిజెపి సర్కార్‌.. ఇప్పుడు ఏకంగా అడవుల నుంచి గిరిజనుల్ని తరిమేసి అటవీసంపదను కొల్లగొట్టేందుకు చట్టాలను ఎడాపెడా మార్చేస్తోంది. క్రోనీ కేపిటలిస్టుల ప్రయోజనాలను అందునా ముఖ్యంగా అదానీకి లబ్ధి చేకూర్చేందుకు కీలకమైన కేంద్రప్రభుత్వ కమిటీలో అదానీ గ్రూపు సలహాదారుడికి చోటు కల్పించింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.. - జనార్దన్‌ చౌదరియోన్‌

image


ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హైడల్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను పర్యవేక్షించే నిపుణుల అంచనాల కమిటీ (ఇఎసి)లో అదానీ సలహాదారు జనార్దన్‌ చౌదరియోన్‌కు ప్రాతినిధ్యం కల్పించడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివిధ కంపెనీలు సమర్పించిన హైడల్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను మదింపు వేయడం, పర్యవేక్షించడం వంటివి ఈ కమిటీ చేస్తుంది. ప్రస్తుతం అదానీ కంపెనీకి చెందిన ఆరు హైడల్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు ఈ కమిటీ ముందు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ స్థితిలో కమిటీలోని జనార్దన్‌ చౌదరియోన్‌ నియామకం అదానీకి లబ్ధి చేకూర్చేందుకేనని ప్రతిపక్ష నేతలు ఎక్స్‌ వేదికగా ట్వీట్లు చేశారు. జల విద్యుత్‌, నదీ లోయ ప్రాజెక్టుల కోసం మంత్రిత్వ శాఖ నిపుణుల అంచనాల కమిటీ (ఇఎసి)ని పునర్వ్యవస్థీకరించినప్పుడు ఆయనను సభ్యుడిగా చేర్చారు.
          పునర్వ్యవస్థీకరించబడిన ఈ కమిటీ (ఇఎసి) ప్రారంభ సమావేశం అక్టోబర్‌ 17-18 తేదీలలో జరిగింది. మహారాష్ట్రలోని సతారాలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎజిఇఎల్‌) కు చెందిన 1500 మెగావాట్ల తరాలి పంపింగ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలతో అక్టోబర్‌ 17 సమావేశానికి చౌదరి హాజరైనట్లు అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి.
         ఈ కమిటీ ఎజిఇఎల్‌ ప్రాజెక్ట్‌ లే అవుట్‌లో మార్పులకు అనుగుణంగా ప్రాజెక్ట్‌ నిబంధనల (టిఒఆర్‌)లో మార్పులను కోరింది. ప్రతిపాదిత నీటి వాహక వ్యవస్థ ఇప్పటికే ఉన్న విండ్‌ ఫామ్‌తో కలుస్తుందని తెలుసుకున్నప్పుడు ఈ సర్దుబాటు అవసరమైంది. ఈ వ్యవస్థ భూగర్భంలో నిర్మించబడిందా? లేదా విండ్‌ టర్బైన్‌ పునాదుల కింద నిర్మించబడిందా? అనే నిర్మాణ సవాళ్లను ఎదుర్కొంటోంది. చర్చల తర్వాత, అదానీకి చెందిన ఎజిఇఎల్‌ అభ్యర్థనను ఇఎసి ఆమోదించడం గమనార్హం. ఈ విషయంలో, చౌదరి మాట్లాడుతూ ఎజిఇఎల్‌ ప్రాజెక్ట్‌పై ఇఎసి చర్చలో తాను పాల్గొనలేదని అన్నారు. సమావేశం మినిట్స్‌లో ఆయన తిరస్కరణ ప్రస్తావనే లేదు.
         పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం 2006 ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఇఐఎ) నోటిఫికేషన్‌ ద్వారా నిర్దేశించబడిన ప్రాజెక్ట్‌లకు అనుమతి మంజూరు చేసే బాధ్యత ఇఎసికి ఉంది. నిర్దిష్ట ప్రాజెక్ట్‌లకు ముందస్తు పర్యావరణ అనుమతి (ఇసి) అవసరం. వివిధ రంగాల్లోని ప్రతిపాదనల క్లియరెన్స్‌పై నిర్ణయం తీసుకునే బాధ్యతను ఈఏసీలు కలిగి ఉంటాయి. అలాంటి కీలకమైన ఇఎసి సభ్యునిగా చౌదరి నియామకం ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రత్యేకించి అదానీకి చెందిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌లన్నీ అదే కమిటీ పరిశీలనలో ఉన్న సమయంలో ఈ నియామకం జరగటమే ఈ ఆందోళనలకు కారణం.
 

                                                    కమిటీ ముందు అనుమతి కోసం అదానీ ప్రాజెక్టులు

ఇఎసి ముందు అనుమతుల కోసం అదానీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ లోని రైవాడలో 850 మెగావాట్లు, పెదకోటలో 1800 మెగావాట్లు, మహారాష్ట్రలోని పట్‌గావ్‌ లో 2100 మెగావాట్లు, కోయినా-నివాకనేలో 2,450 మెగావాట్లు, మల్షేజ్‌ ఘాట్‌ లో 1500 మెగావాట్లు, తాలూలో 1500 మెగావాట్లు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.15,740 కోట్ల పెట్టుబడితో అదనంగా 3.7 గిగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
 

                                                                           ప్రతిపక్షాల ఆగ్రహం

అదానీకి చెందిన 10,300 మెగావాట్లతో కూడిన ఆరు ప్రాజెక్టులు అనుమతుల కోసం కమిటీ ముందున్నాయని, ఆ కమిటీ సభ్యుడిగా అదాని కంపెనీ సలహాదారుడిని నియమించడం దారుణమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ''జాతీయ భద్రత పేరుతో ఎన్నికైన ఎంపీపై ఎథిక్స్‌ కమిటీ చర్యలకు ప్రతిపాదించింది. మరి పర్యావరణ మంత్రిత్వ శాఖలో ప్రయివేట్‌ కంపెనీ వ్యక్తిని ఏ నిబంధనలు ప్రకారం నియమించారు?'' అంటూ ప్రశ్నించింది. టిఎంసి ఎంపీ మహువా మోయిత్రా ''మోడీజీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అదానీ ఉద్యోగి జనార్దన్‌ చౌదరిని ఇఎసిలో సభ్యునిగా నియమించింది. అదానీకి చెందిన ఆరు ప్రాజెక్టుల ఆమోదానికేనా ..?'' అంటూ విమర్శించారు.