
ఓడ ఎక్కేవరకూ ఓడ మల్లయ్య అన్న పెద్దమనుషులు ఓడ దిగాక ఏమంటారో ఆ సామెత తెలిసిన తెలుగువాళ్లకు బాగా తెలుసు. ప్రధాని నరేంద్ర మోడి సర్కారు విధానం అచ్చంగా ఆ సామెతకు నకలుగా తయారైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు ఎన్నికైన మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి రావడానికి సోషల్ మీడియాను సోపానంగా వాడుకున్నారు. కార్పొరేట్ల సాయంతో వేలాది మంది యువతను నియోగించి అహోరాత్రులు ఆయన ఘనతను హోరెత్తించారు. ఉత్తుత్తి ఫోటోలు సృష్టించారు. పాత చరిత్రను మార్చి కొత్త ఇమేజి తేవడానికి తంటాలు పడ్డారు. ఆఖరుకు నరేంద్రమోడీ బిజెపి కార్యాలయం తుడుస్తున్న ఫోటో, ఛారువాలా కథ, చదువుకున్న పట్టాలు ఏవీ నిజమని నిరూపించుకోలేకపోయారు. ఈ పట్టాను గురించిన సమాచారం ఇవ్వవలసిందిగా సంబంధిత సంస్థను ఆదేశించినందుకు తెలుగువాడైన జాతీయ సమాచార హక్కు కమిషనర్ డా|| మాడభూషి శ్రీధర్ను తప్పించారు కూడా. బిజెపి, ఆరెస్సెస్ మార్కు అసత్య కథనాలు కట్టుకథలు తట్టుకోలేక వార్తాసంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. ప్రత్యేక పరిశోధకులను నియమించి నిరూపించవలసి వచ్చింది. ఇదిగో ఈ ఫోటోను మార్ఫింగ్ చేసి కొత్తది తయారు చేశారని లేదంటే అబద్ధాలతో లేని కథ వండివార్చారని సోదాహరణలతో ఎన్నో కథనాలు బయటపెట్టాయి. కొన్నిసార్లు ఈ పరిశోధన తీవ్ర ఇరకాటంలో పెట్టింది. తమ నిజస్వరూపం బయట పెట్టిన వారిపై కక్ష సాధింపులకూ వేధింపులకూ పాల్పడింది. ఆల్ట్ మీడియా అనే సంస్థ ఇందులో విశేషమైన కృషి చేసింది గనక ఆ సంస్థ అధినేతలలో ఒకరైన మహమ్మద్ జుబేర్ను జైలుపాలు చేసింది. సరిగ్గా ఇప్పుడు ఆ అనుభవాన్నే మోడీ సర్కారు మరోవైపు నుంచి ప్రయోగించడానికి సిద్ధమైంది. ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే సహించేది లేదని బెదిరించడమే గాక ఏది నిజం ఏది ఫేక్ అని నిర్ధారించే అధికారం తన చేతుల్లోకి తీసుకుంటున్నది. విమర్శనా స్వేచ్ఛకు, వాస్తవాల వెల్లడికి సాధనాలుగా వుండాల్సిన మీడియా, సోషల్ మీడియాలను నియంత్రించేందుకు కొత్త చట్టాలు బిగిస్తున్నది.
- ఏమిటీ సవరణ?
సోషల్ మీడియా ఇంతగా విస్తరించక ముందు ఇన్ఫర్మేషన్ చట్టం-2000 పని చేస్తూ వచ్చింది. ఈ చట్టంలో సెక్షన్ 69(1) కింద ఏదైనా సంస్థ లేదా మీడియా ప్లాట్ఫారమ్ ప్రకటించిన వార్త దేశానికి హానికరమైనదని, ఉద్రేకాలు పెంచుతుందని భావిస్తే పోలీసులు కేసు పెట్టొచ్చు. మారిన పరిస్థితులలో ఆ చట్టం సరిపోలేదని 2019లో ఫేక్ వార్తల అదుపునకు పిఐబి కమిటీ వేశారు. 2021లో కొత్త సవరణ తీసుకొచ్చారు. వాటి ప్రకారం బనాయించిన అనేక కేసులు సుప్రీం కోర్టు ముందు విచారణలో వున్నాయి. చాలాసార్లు అత్యున్నత న్యాయమూర్తులే వీటిపై విమర్శలు చేశారు, కేంద్రం తన వైఖరి చెప్పాలని తాఖీదులిచ్చారు. కేంద్రం ఆరు నెలల గడువు కోరింది. ఈ కాలంలో ఆ ఆంక్షలు అమలులో వుండవని సుప్రీం ప్రకటించింది. మరోవైపు 2021 సమాచార సాంకేతిక పరిజ్ఞానం నిబంధనల సవరణ ముసాయిదా తీసుకొచ్చింది. దాంతో వ్యూహాత్మకంగా కేంద్రం కొత్త ఎత్తు ఎత్తింది. ఆ ప్రకారం పిఐబి నియమించే ఫేక్వార్తల నియంత్రణ కమిటీ లేదా ప్రభుత్వం అందుకోసం నియమించే మరేదైనా కమిటీకి ఏకపక్ష నిషేధ అధికారం కల్పించారు. ఆన్లైన్ గేమింగ్ను నిరోధించడానికి ఈ చట్టం తెచ్చామని పైకి చెబుతున్నారు గాని నచ్చని అంశాల ప్రచురణలను తొక్కిపట్టడం కోసం అంతకన్నా తీవ్రమైన అంశం జోడించారు. సోషల్ మీడియా వేదికలలో అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, ఓటిటి వంటి వాటిలో వచ్చిన వార్తా కథనాలు (కంటెంట్) అవాస్తవమైతే వాటిని తొలగించే అధికారం పిఐబికి వుంటుందని ఆ సవరణలో ప్రతిపా దించారు. వాటిని తీసేయవలసిందిగా ఆదేశిస్తే మధ్యంతర వ్యవస్థలైన అగ్రిగేటర్లు (అంటే వాటిని నిర్వహించే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, ఓటిటి సంస్థలు) అమలు చేయవలసి వుంటుంది. బూటకపు కథనాలు తొలగిస్తే మంచిదే కదా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ అసలు సమస్య అక్కడే ఉత్పన్నమవుతుంది. ఏది నిజమో ఏది బూటకమో నిర్ణయించేది ఎవరు? వాటికి కొలబద్దలేమిటి?
- గత అనుభవాలేమిటి?
గతంలో నియమితమైన పిఐబి కమిటీ అనుభవం తీసుకుంటే చాలా దారుణంగా వుంది. అనేకసార్లు ఈ కమిటీ కొన్ని వార్తలు బూటకమని (ఫేక్) ప్రకటించింది. కాని ఈ ప్రకటనలే బూటకమైనాయి. సంఘపరివార్ లేదా ప్రభుత్వం విడుదల చేసే ఫేక్లు తేల్చడానికి సోషల్ మీడియాలో కొందరు కృషి చేస్తూ వచ్చారు. ఉదాహరణకు 2020 డిసెంబరులో కేంద్ర నిఘా విభాగం (ఐబి) తరపున విడుదలైన నియామకాలకు సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్ బూటకమని గొప్పగా ప్రకటించింది. తర్వాత చూస్తే అది అధికారికంగా ఇచ్చిందేనని తేలింది. పిఐబి తన ట్వీట్నే తొలగించుకోవాల్సి వచ్చింది. ఇక పరివార్ దుష్ప్రచారాలకు లోటే లేదు. కరోనా సమయంలో ఆర్ణబ్ గోస్వామి వంటి వారు వలస కార్మికులు తరలిపోతున్న ఫోటోను మసీదు బ్యాక్గ్రౌండ్తో ఇవ్వడం ఎంత కలవరం కలిగించిందో గుర్తుండే వుంటుంది. కరోనా కాలంలో ఢిల్లీలోని తబ్లిగీ జమాయత్ మర్కజ్ సంస్థలో ఏం జరిగింది? ఈ విషయంలో అప్పట్లో ప్రధానితో సహా చేసిన ప్రకటనలు ఎలా వున్నాయి? మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు కథనాలు వదలడంపై చివరకు సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్రాస్ ఘటన లోనూ బూటకపు చిత్రాలు వచ్చాయి. నిజమైన ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు పక్కపక్కనే చాలాసార్లు ప్రచురితమైనాయి (ఇలాంటి దారుణమైన అనుభవాలు తెలుగు రాష్ట్రాలలోనూ వున్నాయి. వాటిలోకి వెళితే ఎవరు ఏమిటి అన్నది మరో వివాదమవు తుంది.). విచిత్రమేమంటే పిఐబి ఏర్పాటు చేసిన కమిటీ పరివార్ ప్రచారాల జోలికి పోయిందే లేదు. వారు వెల్లడించిన, ఖండించిన కథనాలలో నూటికి తొంభై ప్రతిపక్షాలకు సంబంధించినవే. రాహుల్ గాంధీ యాత్ర సందర్భంలో ఫోటోలు లేదా ప్రకటనలు, ఇతర ప్రతిపక్షాలు లేదా మీడియా సంస్థలు కథనాలు సమాచారాలపైనే ఎక్కడలేని కేంద్రీకరణ చూపించడం అనుభవంలో చూశాం. పిఐబి అనేది మౌలికంగా ప్రభుత్వ విధానాలను లేదా కృషిని ప్రజలకు మీడియాకు తెలియజేయడానికి ఉద్దేశించిన సంస్థ. ఆ సంస్థ ప్రచారంలో పెట్టే విడుదల చేసే ప్రకటనలు ఎంత వరకూ నిజమని తేల్చవలసిన బాధ్యత మీడియా పైన సోషల్ మీడియా పైన ఇంకా ప్రతిపక్షాలు ప్రజా సంస్థల పైన వుంటుంది. దీన్ని అటూ ఇటూ తిప్పి తక్కిన వారిపై నిఘా వేసి కంటెంటు తొలగించే అధికారాలివ్వడం తలకిందులు తర్కం. ఉదాహరణకు ఇటీవల ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చినపుడు జరిగిన కార్యక్రమాలలో తొంభై శాతం శంకుస్థాపనలు మాత్రమే. ఆ విషయం గట్టిగా చెబితే పిఐబి దాడి చేస్తుంది. ఎందుకంటే ఆ శంకుస్థాపనలు అంచనాల మొత్తంవారు అభివృద్ధి కింద చూపిస్తుంటారు. 'ఊరి' సైనిక కేంద్రంపై దాడి, పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ వంటి వాటిపై విపరీత ప్రచారం జరుగుతుంది. వాటికి సంబంధించిన నిజానిజాలు అడిగితే దేశభద్రతకు ముప్పంటారు. ఇంకా చెబితే దేశద్రోహం ముద్ర వేస్తారు. భారత్-చైనా సరిహద్దులలో పరిస్థితిపై ఏవో కథనాలు వస్తాయి. పూర్తి వివరాలు అడిగితే దాటేస్తారు. ప్రత్యారోపణలు చేస్తారు. ఇలాంటి అనేక సందర్భాలు చూశాం. అసలు పరిశోధనాత్మక జర్నలిజంలో జరగాల్సిందే అది. మోడీ ప్రభుత్వం క్రమంగా ఆ విధమైన పరిశోధనాత్మక జర్నలిస్టులనే వేటాడి ద్రోహుల జాబితాలో చేర్చింది. సర్వాధికారాలు పిఐబికి కట్టబెట్టే కొత్త నిబంధనలు వస్తే గనక ఏలినవారు చెప్పే అసత్య కథనాలు, లేనిపోని గొప్పలే జనానికి వార్తలవుతాయి. ప్రశ్నించడం పరిశోధించి రాయడం అపరాధమవుతుంది. పిఐబి వాటిని తొలగించాలని ఆదేశిస్తుంది. అంటే ఏ ప్రభుత్వ నిర్వాకాలనూ నిజాలనూ మీడియాలో సోషల్ మీడియాలో నిగ్గు తేల్చడం జరగాలో అదే తీర్పరిగా, నియంత్రణకర్తగా మారిపోతుంది. విడుదల చేసిన ముసాయిదాలో దానిపై నిర్దిష్టమైన కొలబద్దలు కూడా లేవు.
- తస్మాత్ జాగ్రత్త
ఈ కారణంగానే ప్రతిపక్షాలూ మీడియా సంస్థలూ పత్రికా యాజమాన్యాలు, ముక్తకంఠంతో ఒక్క గొంతుతో సమాచార స్వాతంత్య్రం మెడపై కత్తి లాంటి ఈ సవరణలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. ఎడిటర్స్ గిల్డ్, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బిడిఎ), ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్), అనేక జర్నలిస్టుల సంఘాలు ఈ మేరకు సవివరమైన సోదాహరణమైన ప్రకటనలు చేశాయి. ఒత్తిడి, విమర్శలు పెరిగాక కేంద్ర ప్రభుత్వ ఐటి శాఖామంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొన్ని సన్నాయి నొక్కులతో కొన్ని వివరణలు ఇచ్చారు. ఈ విషయమై విడుదల చేసిన నిబంధనలపై ఫిబ్రవరిలో సంబంధిత సంస్థలతో (స్టేకహేోల్డర్స్) చర్చలు జరిపిన తర్వాతే అమలు లోకి తెస్తామన్నారు. ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాత్రమే జరుగుతుందని ఆయా శాఖలతో నిర్ధారించుకున్నాకే వాటిని తొలగించడం జరుగుతుందని వివరించారు. ఈ సన్నాయి నొక్కులు ఎలా వున్నా దేశంలో ప్రస్తుత పరిస్థితి, ఆచరణను బట్టి చూస్తే నిస్సందేహంగా మోడీ ప్రభుత్వం మరోసారి సోషల్ మీడియా పీక నొక్కడానికి సమాయత్తం అవుతున్నదనేది స్పష్టం. కనీస పరిశీలన (స్క్రూటినీ) కూడా లేకుండా పిఐబి చెప్పిందే అమలు చేయవలసి వుంటుందని ఎన్డిబిఎ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఏ విధమైన విమర్శ వచ్చినా ఏదో ఒక పేరుతో అణచివేయవచ్చు. పైగా డిజిటల్ సంస్థలూ ఇంటర్మీడియరీలు సర్కారు ఒత్తిడికి గురై తల వంచే పరిస్థితి దాపురిస్తుంది. అసలు ఇంత పెద్ద పరిణామం జరిగినా దేశంలో మీడియా సంస్థలైన పత్రికలు, ఛానళ్లలో పెద్దగా చర్చ లేకపోవడమే అందుకు నిదర్శనం. బడా మీడియా మోడీకి లోబడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియానే ప్రత్యామ్నాయంగా వుంది. దాంట్లో అనేక అవాస్తవాలు, అవాంఛనీయ ధోరణులు నిజమైనా అనేక వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. పైగా సోషల్ మీడియాలో పౌర చొరవకూ పాత్రికేయుల స్వతంత్ర పాత్రకూ చోటుంటోంది. తప్పొప్పులు సరిచేయాలంటే మీడియా, సోషల్ మీడియాలో స్వీయ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు కావాలి గాని అధికార వర్గాలకు నిషేధాధికారాలు ఇవ్వడం అనర్థదాయకం. ఎమర్జన్సీలో విధించిన సెన్సార్ను మించిన స్వీయ సెన్సారింగ్ మీడియాలో సత్యాలను తొక్కి పడుతున్నదని ఇప్పటికే సాయినాథ్ వంటి వారు హెచ్చరించారు. ఈ సమయంలో మోడీపై బిబిసి డాక్యుమెంటరీని అడ్డుకున్న తీరు తాజాగా మన కళ్లెదుటే వుంది. ఈ కొత్త నిబంధనలు వాటన్నిటినీ హరించి వేయడమే గాక రాజ్యాంగం 19(1)(ఎ) అధికరణంలోని ప్రాథమిక హక్కులకూ భావ ప్రకటనా స్వేచ్ఛకూ ముప్పు తెస్తాయి. అందుకే ప్రజాస్వామ్య ప్రియులెవరైనా ఇందుకు వ్యతిరేకంగా ఎలుగెత్తి పోరాడాలి.
తెలకపల్లి రవి