Aug 26,2023 13:00

ప్రజాశక్తి -యు. కొత్తపల్లి (కాకినాడ) : ఎప్పుడూ అలల అలజడి చేస్తూ ఉండే ఉప్పాడ సముద్ర తీరం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో రానున్న రోజుల్లో విపత్తులు సంభవిస్తాయని మత్స్యకార పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతపు సముద్రపు అలలు వెనక్కి వెళ్లాయి. సముద్రమంతా ఎలాంటి అలల అలజడి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి వాతావరణంలో మార్పులు సంభవించాయి. పలుచోట్ల వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చల్లటి వాతావరణం ఏర్పడి, వర్షం కురుస్తున్నప్పటికీ సముద్రుడు మాత్రం ఎలాంటి అలల అలజడి చేయకుండా, సముద్రం వెనక్కి వెళ్లడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయోనని మత్స్యకార పెద్దలు ఆందోళన చెందుతున్నారు.