Nov 18,2022 21:10

ప్రజాశక్తి - భీమునిపట్నం (విశాఖపట్నం) :విశాఖ భీమిలి బీచ్‌లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. తీరం చెంత కాసేపు సరదాగా గడుపుదామని వచ్చిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగివలస అనిల్‌ నీరుకొండ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇసిఇ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఉదయం 11.30 గంటలకు భీమిలి బీచ్‌కు వచ్చారు. లైట్‌హౌస్‌ ఎదురుగా సాగరకన్య బమ్మ వద్ద పెందుర్తికి చెందిన వేమల సూర్యవంశీ, మధురవాడ కారుషెడ్డు ప్రాంతానికి చెందిన కుడితి సాయితోపాటు మరో విద్యార్థి మణికంఠ ఈత కోసం సముద్రంలోకి దిగారు. వీరిలో సూర్యవంశీ, సాయి కెరటాల తాకిడికి గల్లంతయ్యారు. మణికంఠ ఈదుకుంటూ అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నాడు. గల్లంతైన వారి కోసం నేవీ హెలీకాప్టర్‌, మూడు స్పీడ్‌ బోట్లు రంగంలోకి దిగాయి. గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.