Aug 06,2023 14:42

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.శనివారం స్వామివారిని 81,472 మంది దర్శించుకోగా 34,820 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు వచ్చిందని వివరించారు.
ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.