
ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర అభివృద్ధి సంస్థ, ఎంప్లారుమెంట్, సీ డాఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఆర్ఒ మాట్లాడుతూ ఈనెల 13న శుక్రవారం ఉదయం 9:30 గంటలకు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువత కోసం ఉపాధి కల్పనలో భాగంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాలో ప్రసిద్ధి చెందిన 14 కంపెనీలకు చెందిన యాజమాన్య ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 600 దాకా వివిధ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం, ఆర్డిఒ భాగ్యరేఖ, డిఆర్డిఎ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, డిపిఒ విజరు కుమార్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.