జెఎసి కన్వీనర్ రామారావు తీరుపై యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మహేశ్వరరావు
ప్రజాశక్తి -డుంబ్రిగూడ: యుటిఎఫ్ను విమర్శించే నైతిక హక్కు జెఎసి కన్వీనర్గా 1/70 ఉద్యమాన్ని పాలకులకు తాకట్టు పెట్టిన రామారావు దొరకలేదని యుటిఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేశ్వరరావు హెచ్చరించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, జిఒ3 రిజర్వేషన్ సాధన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాలకులు చేస్తున్న కుట్రలో జెఎసి కన్వీనర్ రామారావుదొర ఒక ఏజెంట్లాగా వ్యవహరిస్తున్నారని యుటిఎఫ్ అభిప్రాయపడుతోందన్నారు .ఆదివాసీి ఉపాధ్యాయులు యుటిఎఫ్ నుంచి బయటకు రావాలని జెఎసి పేరుతో రామారావు ద్వారా చేసిన ప్రకటనపై యుటిఎఫ్లో ఉన్న ఆదివాసి ఉపాధ్యాయులంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజన ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, ప్రత్యేక డిఎస్సి సాధించి, గిరిజన ఉపాధ్యాయుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న యుటిఎఫ్ను విమర్శించే నైతిక హక్కు రామారావుకు లేదన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల విద్యాసదస్సు విజయవంతం కావడంతో పాలకవర్గంలో ఉలికిపాటు మొదలైందని, అధికారపార్టీ నేతల ఆదేశాలతో యుటిఎఫ్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జీవో నెంబర్ 3 రద్దుకు కారణం యుటిఎఫ్ సంఘమే అంటూ బురద జల్లే ప్రయత్నం చేయడం ఆయనకు తగదన్నారు.గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగుల ఉద్యమాన్ని ఐక్యం చేస్తున్న యుటిఎఫ్కు మద్దతు ఇవ్వకుండా, పాలకులకు తొత్తులుగా ఉండే వ్యక్తులతో రామారావు దొర కలిసి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. జిఒ 3 సాధనకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న గిరిజన సంఘానికి యుటిఎఫ్ ఆర్థికంగా సహాయం అందించిందని, రామారావుదొరకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. వ్యక్తిగత రాజకీయ అవసరాలకు పెద్దపీట వేస్తున్న రామారావుదొరకు జెఎసి జిల్లా కన్వీనర్గా ఉండే కనీస నైతిక అర్హత కూడా లేదన్నారు.ఎలాంటి వారైనా యూటీఎఫ్ విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు చిట్టిబాబు, కే రఘునాథ్, ఏం బాబురావు ,ఎల్ నారాయణ పాల్గొన్నారు.
యుటిఎఫ్పై దుష్ప్రచారం తగదు
ముంచింగిపుట్టు: ఆదివాసి ఉపాధ్యాయులు యుటిఎఫ్ నుంచి బయటకు రావాలని ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్ రామారావుదొర చేసిన ప్రకటనలపై యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.ధర్మారావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న 'భారత్ బచావో' ,మేధోమథన సదస్సు'లో పాల్గొన్న రామారావుదొర వాట్సప్ ద్వారా పంపిన పత్రికప్రకటనలో ఇలాంటి సూచనలు చేయడం సరికాదన్నారు. జిఒ 3 రద్దుకు వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న న్యాయపోరాటానిక మద్దతునిస్తూ, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాయడంతో పాటు, రివ్యూ పిటిషన్కు ఇంప్లిడ్ కావాలని సూచిన ఘనత యుటిఎఫ్దేనని, అలాంటి యుటిఎఫ్పై బురదజల్లే ప్రకటనలు చేస్తే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు. ఫుందరి, గోపి, ధనుంజయ, ఎస్ రాజు, సిద్దేశ్వరరావు, సిద్ధార్థ రేణుక, ఎ.బుదు పాల్గొన్నారు.










