ప్రజాశక్తి-కాకినాడయుటిఎఫ్ స్వర్ణోత్సవాల ప్రచార జాతాను విజయవంతం చేయాలని జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. ఆదివారం యుటిఎఫ్ హోమ్లో నిర్వహించిన జిల్లా విస్తత కార్యవర్గ సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు కెవి.వి.నాగేశ్వరరావు మాట్లాడారు. యుటిఎఫ్ 1974లో స్థాపించారని, రాబోయే సంవత్సరం యుటిఎఫ్ స్వర్ణోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 24 నుంచి జరిగే ప్రచార జాతాను అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లా ప్రధానకార్యదర్శి తోటకూర రవి చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని, చిన్న చిన్న కారణాలను సాకుగా చూపించి అక్రమంగా సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు. అక్రమ సస్పెన్షన్లు రద్దు చేసి వెంటనే జీతాలు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నరాము మాట్లాడుతూ ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేశామని, జిపిఎస్ ఆర్డినెన్స్ తీసుకువస్తున్నామని కొత్త నాటకానికి తెర లేపిందని, జిపిఎస్కు ఏమాత్రం ఒప్పుకునేది లేదని అయన స్పష్టం చేశారు. పాత పెన్షన్ ప్రవేశ పెట్టడం మినహా ఏ ప్రతిపాదన తమకు అంగీకారం కాదన్నారు. ఈ సమావేశంలో నాయకులు జి.ప్రభాకరవర్మ, పివిఎన్.గనేశ్వర, మహిళా అధ్యక్షురాలు బి.నాగమణి, ఎంవి.సాయిరాం, సిహెచ్.సూరిబాబు, టి.సీతారామయ్య, వి.మహేష్, బి.నూకరాజు, టి.సత్తిబాబు, జి.నాగరాజు, వివి.రమణ, ఎన్.గోవిందరాజులు, పి.గిరిధర్ గోపాలరావు, పివి.సత్యనారాయణ, ఎ.సీతారామరాజు, ఎంఎస్సి.మూర్తి పాల్గొన్నారు.










