


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వం సిపిఎస్, జిపిఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షలను పోలీసులు శుక్రవారం రాత్రి భగ్నం చేశారు. దీక్షలు రెండోరోజుకు చేరుకోవడంతో ఉదయానికే కొందరి ఆరోగ్యం క్షీణించింది. ఈనేపథ్యంలో దీక్ష చేస్తున్న 8 మంది యుటిఎఫ్ నాయకులకు ఒకటవ పట్టణ సిఐ వెంకటరావు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులుగా ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా దీక్షలు చేస్తుండటంతో ఆరోగ్యాలు క్షీణించాయని, బిపి, షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో వైద్యుల సూచనలు మేరకు పోలీసులు దీక్షలో కూర్చున్న యుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.విజయగౌరి, రాష్ట్ర నాయకులు డి.రాము, కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, జెఎవిఆర్కె ఈశ్వరరావు, తిరుపతి నాయుడు, సిపిఎస్ సబ్ కమిటీ కన్వీనర్ పి.రాంప్రసాద్ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద ఉపాధ్యాయులు, పోలీసుల మధ్య లాగులాట జరిగింది. పెద్ద ఎత్తున ఉపాద్యాయులు సిపిఎస్, జిపిఎస్ లను రద్దు చేయాలని, ఒపిఎస్ అమలు చేయాలని యుటిఎఫ్ నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఒపిఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.