
ప్రభుత్వ కళాశాలలో 'యోగ ఫర్ బెటర్ లైఫ్' కోర్సు ప్రారంభం
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
యోగాభ్యాసం ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందాలని యోగా కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్.ఉదయలక్ష్మి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ టివి.దుర్గాప్రసాద్ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 45 రోజుల 'యోగ ఫర్ బెటర్ లైఫ్' సర్టిఫికెట్ కోర్స్ని సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రపంచానికి యోగా విద్యనందించిన పతాంజలి మహర్షి గురించి తెలియజేశారు. అనంతరం కోర్సు కోఆర్డినేటర్లు సర్టిఫికెట్ కోర్స్ ప్రాధాన్యతను వివరించారు. కళాశాల సిపిడిసి కార్యదర్శి యిరదల రఘుబాబు, సభ్యులు ఎల్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చక్కని కోర్స్ రూపకల్పన చేసినందుకు కళాశాల ప్రిన్సిపల్ను అభినందించారు. అనంతరం యోగా శిక్షకులు కమ్ముల ఆదినారాయణ మాట్లాడుతూ మనసు, శరీరాలను సమన్వయం చేయడమే యోగ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పి.అజరు కుమార్, ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేబి.రావు, ఏలూరు రోటరీ అధ్యక్షులు ఎన్.రోహిత్, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.