May 19,2023 15:56
  • వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు : మంత్రి రోజా
  • వాలంటీర్లు ప్రజాసేవలో ఆత్మ సంతృప్తితో పని చేయాలి : కలెక్టర్

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, వాలంటీర్లు సేవలు వెలకట్టలేనివి అని, వాలంటీర్లు సంక్షేమ సేవకులని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ 15 ఆగష్టు 2019 వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమ నిర్వహణ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెల కట్టలేనివని అన్నారు. వాలంటీర్లు అంటే జగనన్న సైనికులు అని, కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎంతో విశేష సేవలు చేశారని తెలిపారు. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు అని చెప్పవచ్చు అని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన సూర్యుడు కంటే ముందుగా అవ్వా తాతలకు, అర్హులైన ఇతరులకు వారి ఇళ్ళ ముంగిటకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. జగనన్నకు మంచి పేరు తెచ్చేలా మీరు పనిచేస్తున్నారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిది అని, సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న నిజమైన నాయకుడు అన్నారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర లుగా వారిని సత్కరించడం, నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లకు నిజమైన వందనాలు అని తెలుపుతూ, ఇప్పుడు పురస్కారం పొందలేని వాలంటీర్లు పోటీ పడి ఉత్తమ సేవలు అందించి వచ్చే సంవత్సరం పురస్కారం అందుకునేలా కృషి చేయాలని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇంతటి మంచి వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఏర్పాటు ఎక్కడా లేనే లేదని, గ్రామంలో ప్రజల ముంగిటకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందించటలో వాలంటీర్లు కృషి చేస్తున్నారని వారి సేవలకు వెలకట్టలేమని అన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాసేవలో ఆత్మసంతృప్తి కోసం పనిచేయాలని హితవు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో ఎలాంటి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అయినా గ్రామ వార్డు స్థాయికి అదే రోజు చేరే అవకాశం ఉందని, అంతేకాకుండా దానికి స్పందన కూడా ఒకేరోజులో తెప్పించుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు. గ్రామవాలంటీర్ సమాజం పట్ల సేవాభావం కలిగి, తనకు కేటాయించబడిన 50 కుటుంబాలకు ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పిస్తూ, సంక్షేమ పథకాల సమాచారాన్ని, వాటి ప్రయోజనాలను ప్రజల ఇంటి ముంగిట అందిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామ సెక్రెటేరియట్ నందలి వివిధ శాఖల ప్రతినిధులకు చేరవేస్తూ, ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన సేవలను సమర్ధవంతంగా అందించే స్వచ్ఛంద సేవకుడే "గ్రామ వాలంటీర్." అని తెలిపారు.
తిరుపతి మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ఏర్పాటుతో గ్రామ, వార్డు ప్రాంతాలలో పరిపాలన మరింత సులువు అయిందని, వాలంటీర్ల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముందుగా వాలంటీర్లు వారు చేస్తున్న సేవల అనుభవాలను పంచుకున్నారు. సి ఎం ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అందరూ వీక్షించారు.

జిల్లాలో సేవా మిత్రకు 10751 , సేవరత్నకు 215, సేవా వజ్ర కు 35 మొత్తం 11001 మంది వాలంటీర్లు వారు అందించిన ఉత్తమ సేవలకు గాను సత్కారాలు పొందనున్నారని, అందులో నేడు జిల్లా స్థాయిలో కొంత మందికి సేవ మిత్ర, రత్న, వజ్ర సన్మానాలు పురస్కారాలు అందచేస్తున్నామని, నియోజక వర్గ పరిధిలోని మండలాల్లో, వార్డు స్థాయిలలో పది రోజుల పాటు ఈ పురస్కార కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.