పంజాబ్ : కోవిడ్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వారినుండి మరొకరికి వైరస్ సోకుతుంది. అయితే పంజాబ్లోని అమృత్సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు సరికొత్త విషయాన్ని గుర్తించారు. అదేంటంటే.. కరోనా సోకిన వ్యక్తి కంటి నుంచి వచ్చే కన్నీటిలో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 120 మంది రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్నీటి నుండి కంటే ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారానే కోవిడ్ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కరోనాకు ట్రీట్మెంట్ చేసే వైద్యులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు.