May 29,2023 21:24

అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలిగించేలా అధికారులు పని చేయాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ సూచించారు. వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తిపరిచేలా చూడాలని తెలిపారు. సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో డివిజన్‌లోని ఆయా మండలాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు డివిజన్‌ స్థాయి వరకు రాకుండా చూసుకోవాలన్నారు. గడువులోపు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలో వెళ్లకుండా చూడాలన్నారు. సీనియర్‌ సహాయకులు రామయ్య, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ చేతన్‌ ప్రియా, ఆర్‌టిసి డిఎం మహ్మద్‌ రఫీ, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.
ప్రజలు సమస్యలను సత్వరంగా పరిష్కరించుకునేందుకు స్పందన కార్యక్రమాన్ని సద్వనియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కమిషనర్‌ మాట్లాడుతూ... ప్రజలు సమర్పించిన అర్జీల్లో ఆధార్‌ కార్డు నెంబర్‌ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ఆర్థిక పరమైన ఫిర్యాదులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.