
ప్రజాశక్తి-అనకాపల్లి
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం రెండవ విడతలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను శుక్రవారం ఆయన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ యంత్ర పరికరాలకు ప్రభుత్వం ప్రతి గ్రూపునకు 40 శాతం సబ్సిడీని, 50 శాతం బ్యాంకు రుణంగా అందజేస్తుందని, 10 శాతం మాత్రమే గ్రూప్ సభ్యులు చెల్లించాలని తెలిపారు. గత ఏడాది మొదటి విడతలో 271 గ్రూపులకు రూ.4.61 కోట్ల విలువైన పరికరాలను అందజేయగా, ఈ ఏడాది 2వ విడతలో 148 సిహెచ్సిలకు రూ.2,61,99,072 విలువైన ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు అందించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ రవి పఠాన్శెట్టి మాట్లాడుతూ జిల్లాలో 450 రైతు భరోసా కేంద్రాల పలు సేవలు అందుతున్నాయన్నారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు అందిస్తామన్నారు. రైతులకు ఇంకా ఏమైనా కావాలన్నా, వారి సమస్యలనైనా 1902 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి గాని, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలోగాని తెలియజేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు, ఎంపీపీ గొర్లె సూరిబాబు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ మండలంలోని ఐదు గ్రూపులకు యంత్ర పరికరాలను శుక్రవారం అనకాపల్లిలో మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండలం నుండి మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కోన రామారావు, వైస్ ఎంపిపి భూస అప్పలరాజు, మండల వ్యవసాయాధికారి సిహెచ్చంద్రావతి, ఎఇఒ ఎమ్ నరసింహ మూర్తి, గ్రూప్ సభ్యులు కోరుకొండ వెంకట రమణ, గుండు సాధూరావు, కుండ్రపు తాతాజీ, గెడ్డం బాబూరావు రైతులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని లోపూడి, వడ్డాది, ఆర్ శివరాంపురం, మంగళాపురం రైతు భరోసా కేంద్రాలకు వైయస్సార్ యంత్ర సేవా పథకంలో భాగంగా ఒక్కొక్క ట్రాక్టర్ను అనకాపల్లిలో అందజేసినట్లు జడ్పిటిసి దొండా రాంబాబు శుక్రవారం తెలిపారు.