వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- డిఎంహెచ్ఒ డాక్టర్ వెంకటరమణ
ప్రజాశక్తి - నంద్యాల రూరల్
మలేరియా, డెంగ్యు, మెదడువాపు జ్వరాలు గ్రామాల్లో ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్.వెంకటరమణ వైద్యులకు సూచించారు. మంగళవారం నంద్యాల మండలం మద్దూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సమావేశాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీక్షలో భాగంగా ఎన్సిడి-సిడి సర్వే నిర్వహించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనీమియా టూల్ మానిటరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మలేరియా, డెంగ్యు, మెదడువాపు జ్వరాలు గ్రామాల్లో ప్రబలకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో ఫ్రై డే - డ్రై డే కార్యక్రమాన్ని వందశాతం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో వడ దెబ్బ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఆర్బిఎస్కె, ఆర్కెఎస్కె కార్యక్రమంలో భాగంగా స్కూల్స్లో ఉన్న ప్రతి విద్యార్థికి వంద శాతం స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణ చర్యలు హెచ్ఎంఐఎస్, ఆర్సిహెచ్, సిఎస్ఎస్ఎం పోర్టల్లో వందశాతం అప్లోడ్ చేయాలన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.










