ప్రజాశక్తి - కొమరాడ, గరుగుబిల్లి: ప్రాణాంతక వ్యాధులకు గురి కాకుండా పిల్లలకు పూర్తి స్థాయిలో వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరి అని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు అన్నారు. మిషన్ ఇంద్ర ధనుష్ రెండో విడతలో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహించిన టీకా కార్యక్రమాలను మండలంలో గుణానుపురం, అర్తాం గ్రామాల్లో ఆయన మంగళవారం పరిశీలించారు. ఈరోజు సెషన్స్లో ఎంతమందికి టీకా వేస్తున్నారని, సిబ్బందిని ఆరా తీయగా 8మంది ఐదేళ్లలోపు పిల్లలకు, ముగ్గురు గర్భిణులకు వేస్తున్నట్లుగా తెలిపారు. వారి వివరాలను ఆయన ఆర్సిహెచ్ రిజిస్టర్స్, టీకా కార్డుల్లో పరిశీలించారు. వేసేముందు టీకా ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. టీకాల ఆన్లైన్ నమోదుకు సంబందించిన యూవిన్ పోర్టల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు అక్కడ చిన్నారికి టీకా చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ప్రారంభమైన మిషన్ ఇంద్ర ధనుష్ రెండో విడత కార్యక్రమం 16 వరకు కొనసాగుతుందని, ఐదేళ్లలోపు పిల్లలు ప్రాంతాల వ్యాధులకు గురికాకుండా, ముఖ్యంగా తట్టు, రుబెళ్లా తదితర వ్యాధులు పూర్తి స్థాయిలో నిర్మూలించడం మిషన్ ఇంద్ర ధనుష్ ఉద్దేశ్యమని అన్నారు. గతంలో ఏవైనా కారణాల వల్ల టీకా వేసుకొని పిల్లలకు, ప్రస్తుత షెడ్యూలు ప్రకారం అర్హులైన పిల్లలు, గర్భిణీ లకు టీకా వేయడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సూపర్ వైజర్స్ నిర్మల, జయగౌడ్, వైద్య సిబ్బంది శ్రావణి,వర్షిణి, రామకష్ణ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా మండలంలోని రావివలస పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ కర్రి అరుణకుమారి ప్రారంభించారు. ఈ మేరకు పిహెచ్సి పరిధిలోని ఆయా గ్రామాల్లో రెండో విడత చేపడుతున్న మిషన్ ఇంద్రధనస్సు టీకా కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మిషన్ ఇంద్రధనస్సు రెండవ విడత టీకా కార్యక్రమంలో గర్భిణీలకు, ఐదేళ్లలోపుపిల్లలకు వ్యాధి నిరోధకటీకాలు సిబ్బంది వేయనున్నారన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గుంట్రెడ్డి.సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.










