Aug 27,2022 19:55

దొంగతనానికి గురైన దుకాణం ముందు గుమిగూడిన జనం

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పట్టణవాసులు బెంబేలెత్తుతున్నారు. వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు కూత వేట దూరంలోనే షరాఫ్‌ బజార్‌ ఉంది. అక్కడ జ్యువెల్లరీ దుకాణాల్లో దొంగతనం జరగడంతో పోలీసుల వైఫల్యం విధుల పట్ల ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎస్‌కెడి కాలనీలో, బుడ్డేకల్లు వీధిలో, బైపాస్‌ రోడ్డులో, విజయ భాస్కర్‌ రెడ్డి నగర్‌, వెంకన్నపేట, షరాఫ్‌ బజార్లలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దొంగతనం జరిగి ఏడాది గడిచినా సొమ్ము రికవరీ చేయడంలో నిర్లక్ష్యం చేశారని బాధితులు వాపోతున్నారు. గత రెండు నెలలుగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాలు విసురుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కూతవేటు దూరంలో పోలీసు స్టేషన్‌ ఉన్నా దొంగతనాలకు పాల్పడుతున్నారు.
హవన్న పేట రోడ్డులో ఉన్న జబ్బార్‌ జ్యువెల్లర్స్‌లో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగినట్లు సిసి కెమెరా రికార్డింగ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. షాపు యజమాని చెప్పిన వివరాల మేరకు 2.5 కిలోల బంగారు, 20 కిలోల వెండి సుమారు రూ.1.5 కోట్ల విలువ చేసే సొమ్ము దోచుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు త్రీ టౌన్‌ ఇన్‌ఛార్జీ సిఐ విక్రమ్‌ సింహ తెలిపారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి పరిశీలించిన తర్వాత జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌ టీం ద్వారా వివరాలు సేకరించామని, లభించిన ఆధారాల ద్వారా అతి త్వరలో దొంగలను పట్టుకుంటామని వివరించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణంలో గస్తీ పెంచామని, దొంగతనాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రకటిస్తున్నా ఆదోనిలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు మాత్రం తమ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నామని, కళ్లు కప్పి చోరీలు జరగడం సవాల్‌గా మారిందని వాపోతున్నారు. దొంగతనాలు జరగకుండా ప్రత్యేక పోలీసులను నిఘా ఉంచాలని పట్టణవాసులు కోరుతున్నారు.