
వర్షాభావమే..!
- జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి
- ఎండుతున్న పంటలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/కొత్తపల్లి
నంద్యాల జిల్లా వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. జిల్లాలోని 29 మండలాల్లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు నెలలో 26 మండలాల్లో 50 శాతం కన్నా లోటు వర్షపాతం నమోదైంది. దీంతో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి...
జిల్లాలో ఖరీఫ్ ప్రారంభంలో తొలకరి చినుకులు పడటంతో రైతులు ఆశతో పలు పంటలను సాగు చేశారు. తీరా వర్షం పడకుండా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కన్నా 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటున 152.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 40.08 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. జిల్లాలోని 29 మండలాల్లో 26 మండలాల్లో 50 శాతం కన్నా లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాములపాడు మండలంలో 93 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. 161.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 12 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. నంద్యాల జిల్లాలో ప్రధాన పంటగా ఉండే వరి సాధారణ సాగు 1,76,315 ఎకరాలు కాగా కేవలం 45,062.5 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ సాగు 1,04,745 ఎకరాలు కాగా 86,125 ఎకరాల్లో విత్తనాలు విత్తారు. కంది సాధారణ సాగు 93,877.5 ఎకరాలు కాగా 73,680 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ సాధారణ సాగు 39,510 ఎకరాలు కాగా 21,050 ఎకరాల్లో సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 63,965 ఎకరాలు కాగా ఇప్పటి వరకూ 23,287.5 ఎకరాల్లో సాగైంది. ఉల్లి సాధారణ సాగు 10,182.5 ఎకరాలు కాగా 4,997.5 ఎకరాల్లో సాగు చేశారు. మిరప సాధారణ సాగు విస్తీర్ణం 25,010 ఎకరాలు కాగా 13,050 ఎకరాల్లో సాగైంది. గతేడాది మిర్చి పంట తెగుళ్లతో భారీగా నష్టాలు మూటగట్టుకోవడంతో రైతులు ఈ ఏడాది మిరప సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. విత్తనాలు వేసిన సమయంలో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ మునుముందు వర్షాలు కురుస్తాయని రైతులు ఆశపడి విత్తనాలు వేశారు. విత్తనాలు మొలచిన కొన్ని రోజుల వరకు రైతులకు వర్షాలు లేకపోవడంతో రైతులు వర్షం కోసం ఎదురు చూశారు. ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో మొలకెత్తిన మొక్కజొన్న పత్తి మునగ పంటలు నీటిలో మునిగి పూర్తిగా చనిపోయింది. ఆ పరిస్థితుల్లో కొందరు రైతులు పంటలను పూర్తిగా చెడగొట్టారు. మొక్కజొన్న వేసిన రైతులకు ఒక ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు వస్తుంది. పత్తి పంటకు ఎకరాకు సుమారు రూ.15 వేల నుంచి రూ.20వేల దాకా ఖర్చవుతుంది. అదే కౌలు రైతులకు అదనంగా ఈ ఖర్చుతోపాటు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా కూడా గుత్త చెల్లించవలసి ఉంటుంది. ఇంత ఖర్చు చేసిన రైతన్నలపై ప్రకృతి కన్నెర్ర చేసి వర్షాకాలం అయిపోతున్నా రైతులకు సరైన వర్షాలు పడకపోవడంతో ఎండాకాలం లాగా ఎండలు మండుతుండడంతో అరకొరగా ఉన్న పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. వరి పంట తప్పితే పత్తి మొక్కజొన్న వేసిన రైతులు చేసిన అప్పులు కూడా తీర్చలేక ఆత్మహత్యల శరణ్యం అనుకున్న రైతులకు కరువు మండలంగా ప్రకటించి నష్టపరిహారం అందిస్తే తప్ప రైతులు గట్టెకి పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా బావుల కింద ఉన్న రైతులు తమ పొలాల్లో నీటిని పెట్టుకునేందుకు వెళ్లగా రైతులకు వచ్చే మూడు లైన్ల కరెంటు ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉంటూ పొలాలను ఎండ కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.
వర్షాలు లేక పంటలు చెడగొట్టాము..
- సుబ్బరాయుడు, పత్తి రైతు పెద్ద గుమ్మడాపురం.
ఈ ఏడాది కురిసిన వర్షాలకు పంటలు వేసి సరైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పంటలు చెడగొట్టాము. నాకున్న 5 ఎకరాల పొలంలో 3 ఎకరాలు పత్తి పంట సాగు చేశాను. పత్తి పంట ఒక ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా ఖర్చు చేశాను. 3 ఎకరాలకు కలిపి సుమారు రూ.60 వేల దాకా ఖర్చు వచ్చింది. ప్రస్తుతం ఎండలు చూస్తే అరకొరగా ఉన్న పంటలు కూడా చెడగొట్టే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి..
- మొక్కజొన్న రైతు చిన్న శేషన్న, కొక్కెరంచ.
వర్షాలు కురిసిన తర్వాత తనకున్న పొలంలో మొక్కజొన్న పంట వేసాము. నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. నాకు ఉన్న 7 ఎకరాల పొలంలో మొక్కజొన్న పంటలు వేసాము.7 ఎకరాలకు గాను పెట్టుబడి1,10 వేల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. పొలాలను చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టంగా ఉంది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.