ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రపంచ హృదయ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 29న తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆసుపత్రి నిర్వహకులు డాక్టర్ కె. తిరుమల ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 29న ఉదయం కోట నుంచి ర్యాలీ ప్రారంభమై తిరుమల మెడికవర్ ఆసుపత్రి వరకూ సాగుతుందన్నారు. ర్యాలీని జిల్లా ఎస్పీ. దీపికా పాటిల్ ప్రారంభిస్తారని తెలిపారు. ర్యాలీ అనంతరం గుండె జబ్బులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ఆసుపత్రి సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. మెడికవర్ ఆసుపత్రి వారు హార్ట్ సేవర్స్ సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నివసిస్తున్నారని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి ఇస్తున్న ఈ శిక్షణ ను సధ్వినియోగం చేసుకోవాలని కోరారు. రోజు ఉదయం 7 గంటలకు ఆసుపత్రి కింది అంతస్తులో జిల్లా వాసుల కోసం ఉచిత గుండె తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ తిరుమల ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆసుపత్రి ఇంటెన్సివ్ వైద్య నిపుణులు డాక్టర్.పి.ఎస్.వి. రామారావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎ. శరత్ కుమార్ పాత్ర, డాక్టర్ సిహెచ్ మహేష్, ఆసుపత్రి సెంటర్ హెడ్ విఎన్.పద్మ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ
తిరుమల మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం వర్కింగ్ జర్నలిస్టులకు ప్రివిలేజ్ హెల్త్ కార్డ్స్ ను జారీ చేసింది. ఆసుపత్రి ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జర్నలిస్టులకు ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ తిరుమల ప్రసాద్ చేతుల మీదుగా 165 మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్డుల ద్వారా ప్రత్యేక ప్రాధాన్యత, రాయితీ ఉంటుందని డాక్టర్ తిరుమల ప్రసాద్ తెలిపారు. ప్రెస్క్లబ్ ప్రతినిధులు ఎం.ఎం.ఎల్.నాయుడు, కె.రమేష్నాయుడు, పంచాది అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










