ప్రజాశక్తి- పెందుర్తి : వరద బాధితుల సహాయ నిమిత్తం సిపిఎం నాయకులు శనివారం సుజాత నగర్ కూడలిలో విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు శంకరరావు మాట్లాడుతూ, దాతల నుంచి వచ్చిన విరాళాలను ఇటీవల ముంపునకు గురైన వరద బాధితులకు సిపిఎం అందజేస్తుందని తెలిపారు. కార్మిక, కర్షక, పేదలకు సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలనాయుడు, సింహాచలం శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
మాధవధార : యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యాన వరద బాధితుల సహాయార్థం విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు ఉద్యోగులు, కార్మికుల నుంచి విరాళాలు సేకరించారు. రూ.17,200 విరాళం వచ్చినట్లు యూనియన్ జనరల్ సెక్రటరీ కె.సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ త్రినాధరావు, డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










