వివిధ చోరీలకు పాల్పడిన నిందితులు అరెస్ట్
- 40 లక్షల సొత్తు స్వాధీనం
ప్రజాశక్తి -తిరుపతి సిటీ :జిల్లాలో అనేక చోట్ల దొంగత నాలకు పాల్పడుతున్న ఐదు గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నలభై లక్షల రూపా యల చోరీ సోత్తును స్వాధీ నం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగతోపాటు తిరుపతి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులను కూడా అరెస్టు చేసి వారి వద్ద నుండి 363 గ్రాముల బంగారు, 100 గ్రాముల వెండి, 1లక్ష 90 వేల రూపాయల నగదు, 15 మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ పరికరాలు బోరు మోటార్, ఐరన్ కట్టర్, గ్రైండర్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్ట్ అయిన వారు ఇప్పటికే 28 కేసుల్లో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. ఈ మధ్యకాలంలో జిల్లా వ్యాప్తంగా చూస్తే కొంతమేర దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని పోలీస్ శాఖ కూడా దొంగతనాలన్ని నివారించడానికి ప్రత్యేక కార్యచరణలతో ముందుకు వెళుతోందన్నారు. ఇప్పటికే క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రైమ్ బందాలు రంగంలో దిగి పనిచేస్తుందని, ప్రస్తుతం కొన్ని దొంగతనాల తీరును పరిశీలిస్తే ఎక్కువ భాగం జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడిన జులాయిలే కనిపిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అపార్టుమెంట్లో, కాలనీలలో, సొసైటీలకు సంబంధించిన వారు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా కొంతమేర దొంగతనాలను అరికట్ట వచ్చని అన్నారు. ప్రజలు ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీస్ శాఖ వారు ఉచితంగా ఏర్పాటు చేసే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను పెట్టుకోవాలని తద్వారా తిరిగి ఇంటికి వచ్చేవరకు కెమెరాల నిఘాతోపాటు పోలీస్ నిఘా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. మీ పరిసర ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. చోరీ కేసులో నిందితులను అదుపులో తీసుకుని సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బందిని అయన అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పి విమల కుమారి, చంద్రగిరి యస్డిపిఓ యశ్వంత్, చంద్రగిరి సి.ఐ రాజశేఖర్, చంద్రగిరిసబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.










