ప్రజాశక్తి- తెనాలి:వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నంబూరు కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సులో 163 కళాశాలలకు చెందిన విద్యార్థులు వారి పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వివిఐటి 24వ ప్రచురణ ప్రముఖ కథా రచయిత శ్రీ రమణ రచించిన 'నిన్నటి పరిమళాలు' పుస్తకాన్ని హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీర్లలో నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకత అవసరమన్నారు. అవి సదస్సులు, వర్క షాపులు, ఇంటర్నెట్ షిప్ ద్వారా పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యా మండలి తమ వంతు కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా 'టాక్ టు బుక్' కార్యక్రమం ద్వారా యువ రచయితలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అబ్సల్యూట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాదాసు పాపారావు, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున రెడ్డి, డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ కె. గిరిబాబు, డీన్ ఆఫ్ అడ్మిన్ డాక్టర్ ఎన్ కుమారస్వామి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ వి రామచంద్రన్, అధ్యాపకులు పాల్గొన్నారు










