ప్రజాశక్తి-బాపట్ల: వైఎస్ వివేకానందరెడ్డి హత్యను తెలుగుదేశం పార్టీకి అంటగట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన ముఖ్యమంత్రికి చుక్కెదురైందని, హత్యకేసులో నిందితులను అరెస్టు చేయడంతో జగన్ అసలు రంగు బయటపడిందని బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ఆదివారం బాపట్ల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైసిపి ప్రభుత్వం వైఫల్యాలు, వివేకా హత్యోదంతంపై చీరాల టిడిపి బాధ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. నరేంద్రవర్మ మాట్లాడుతూ జగన్ వైఫల్యాలు మాట్లాడుకోవడానికి రోజులు సరిపోవని, గ్రంథాలు రాయవచ్చని అన్నారు. కూరగాయలు అమ్మేవారు డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బులు తీసుకుంటుంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. ఆ డబ్బంతా ఏమి చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వాడకం పెరిగిపోయిందని అన్నారు. ప్రభుత్వం యువతను మత్తుకు బానిసలను చేయడంతో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితిలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ను ఆదర్శం గా తీసుకుని ఆ పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇసుక, భూ మాఫియాతో కోటానుకోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అక్రమాలు బహిరంగ రహస్యమేనని అన్నారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య మాట్లాడుతూ హత్యా రాజకీయాలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది ఆరితేరిన చేయన్నా రు. తన అధికార దాహానికి సొంత కుటుంబ సభ్యులను కూడా బలి చేయడానికి వెనుకాడని క్రూర మనస్తత్వం గల ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. బాబా యి హత్య, కోడికత్తి డ్రామాతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి నిజ స్వరూపం ప్రజల కు స్పష్టంగా అర్థం అయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని కొండయ్య హెచ్చరించారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకు లు కౌతావరపు జనార్దన్, రామకృష్ణ, గొలపల శ్రీనివాసరావు, తనికొండ దయబాబు, తోట నారాయణ, ప్రమీల రాణి, ఫరీద్ మస్తాన్, ఊట్ల రామారావు పాల్గొన్నారు.










