ప్రజాశక్తి-ఆలూరు
విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల హక్కు అని, ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలూరులోని రాఘవేంద్ర డిగ్రీ కళాశాలలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సదస్సు నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మైనా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నగేష్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షబ్బీర్ మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరణను విరమించుకోవాలని జరుగుతున్న పోరాటం ఈనెల 8 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుందని తెలిపారు. వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు 8న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయని చెప్పారు. లాభాలు వస్తున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరించాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటయితే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు పోతురాజు, మండల ఉపాధ్యక్షులు గిరి మూర్తి, హరికృష్ణ, మండల సహాయ కార్యదర్శి మహేష్, బసవరాజు, పరమేష్, ఎఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగ, మండల కార్యదర్శి మోహన్ నాయక్, అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఎఐవైఎఫ్ జిల్లా సభ్యులు రమేష్ పాల్గొన్నారు. ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యా సంస్థల బంద్కు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.షాబీర్ బాష, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు భరత్ కుమార్, పిడిఎస్యు జిల్లా కోశాధికారి సోమశేఖర్, పిడిఎస్ఒ రాష్ట్ర నాయకులు తిరుమలేష్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అఖండ, బిడిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించి కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఎఐఎస్ఎఫ్ డివిజన్ సహాయ కార్యదర్శి జై, మల్లికార్జున, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వీరేంద్ర, రవి, కిషోర్, ప్రవీణ్, సాయి, నాగేష్, విష్ణు పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్