ప్రజాశక్తి-కందుకూరు : కార్పొరేట్ రంగంలో ఉద్యోగాల నియామకం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో ఎంఎన్సి విప్రో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం అనుహ్య పరిణామమని కరస్పాండెంట్ కంచర్ల రామయ్య హర్ష వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ప్రారంభమైన ప్రాంగణ ఎంపికలు రాత్రి వరకూ జరిగాయి. టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ కె.విజయ శ్రీనివాస్ నిర్వహణలో విప్రో కంపెనీకి సంబంధించిన ఐదుగురు సభ్యుల బందం వివిధ స్టేజీలలో విద్యార్థులను గ్రూపులుగా విభజించి నైపుణ్యాలను పరిశీలించింది. 2023వ సంవత్సరం బ్యాచ్కు చెందిన విద్యార్థులు సుమారు 75 మంది హాజరు కాగా 30 మందిని గూగుల్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చారని డాక్టర్ విజరు వెల్లడించారు. విప్రో హెచ్.ఆర్ కౌషిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి 2.2 లక్షల వార్షిక వేతనం లభిస్తుందని డాక్టర్ విజయ వెల్లడించారు. కంపెనీలో వారి పనితీరు, నైపుణ్యాల మేరకు రెండు, మూడేళ్లలో 4-5 లక్షల వేతనానికి చేరుకోవచ్చున్నారు. ఇందులో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన వారిని నేరుగా గూగుల్ కంపెనీ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. గూగుల్ ఆకర్షించే స్థాయిలో కష్టపడి ఎక్కువ మంది వచ్చే ఏడాదికి విప్రో నుంచి ప్రగతిని సాధించాలని, దానికి అవసరమైన సూచనలు ప్రకాశం టెక్నికల్ డైరెక్టరు డాక్టర్ శ్రీనివాస్ ఆన్ లైన్ లో ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని రామయ్య భరోసా ఇచ్చారు. ఎన్. మాధవరావు, కె.కోటయ్యలు పాల్గొన్నారు.










