ప్రజాశక్తి-అనకాపల్లి
వినియోగదారుల హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో శుక్రవారం వినియోగదారుల హక్కుల పరిరక్షణ వారోత్సవం సందర్భంగా వినియోగదారులు, కమిషన్లలో సమర్థవంతంగా పరిష్కరించడం అనే అంశంపై ఆమె మాట్లాడారు. వివిధ రకాల వస్తువులు, ఉపకరణాలు, ఆహార పదార్థాలపై ముద్రించిన కనీస ధరలు, ఉపయోగించే ఆఖరు తేదీ వంటి అంశాలపై అవగాహన ఉండాలని సూచించారు. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వినియోగదారులకు సరైన న్యాయం జరగలేదన్నారు. వినియోగదారుల కోర్టు జడ్జి వెంకటేశ్వరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవడంలో వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ శారద బాయి, డీఎస్ఓ ప్రసాద్, జిల్లా వృత్తి విద్య అధికారి, లీగల్ మెట్రాలజీ అధికారి రంగారెడ్డి, తహశీల్దారు గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.










